ఎన్టీఆర్ జిల్లా, ఆగస్టు 01, 2025
గౌరవప్రద జీవితానికి ఎన్టీఆర్ భరోసా
- అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పెన్షన్ల పంపిణీ
- జిల్లా ప్రత్యేక అధికారి, సీసీఎల్ఏ జి.జయలక్ష్మి
పేద ప్రజలకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వీలుకల్పిస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి, సీసీఎల్ఏ జి.జయలక్ష్మి అన్నారు.
విజయవాడ అర్బన్ పరిధిలోని 22వ డివిజన్ భ్రమరాంబపురంలో సీసీఎల్ఏ జయలక్ష్మి అధికారులతో కలిసి లబ్దిదారులకు సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియ గురించి అడిగి తెలుసుకొని.. ఏవైనా సమస్యలు ఉంటే చెప్పండని అన్నారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్లవద్దే అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నామన్నారు. జిల్లాలో సామాజిక భద్రత పెన్షన్ల ద్వారా 2,30,688 మంది లబిద్దారులకు రూ. 99.41 కోట్లు మేర పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. అదేవిధంగా ఆగస్టు నుంచి జిల్లాలో 4,138 స్పౌజ్ పెన్షన్లు (రూ. 1.65 కోట్లు) మంజూరైనట్లు ప్రత్యేక అధికారి జయలక్ష్మి తెలిపారు.
ఆత్మీయతతో పలకరించి పెన్షన్లు అందించి: శుక్రవారం విజయవాడ అర్బన్ పరిధిలోని పటమటలంకలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పాల్గొన్నారు. లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ వారి కష్టసుఖాలను అడిగితెలుసుకున్నారు. కొత్తగా మంజూరైన స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్డీవో కె.మాధురి, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు కూడా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు.