ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. వేధింపులుఅన్నింటా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం జగన్

0

29.07.2025.
తాడేపల్లి.

ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. వేధింపులు
అన్నింటా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం
ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా పచ్చి మోసం
అందుకే ప్రశ్నించే విపక్షం గొంతు నొక్కే ప్రయత్నం
:శ్రీ వైయస్‌ జగన్‌ ధ్వజం

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ నేతృత్వంలో పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం. హాజరైన కమిటీ సభ్యులు.

రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి. యథేచ్ఛ దోపిడి
ఎక్కడా పాలన అనేది లేదు. ప్రజలకు ఏ మేలూ లేదు
చంద్రబాబు ష్యూరిటీలో పక్కాగా మోసం గ్యారెంటీ
:శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

చంద్రబాబు మోసాలు మరింత ఎండగట్టాలి
ఆ దిశలోనే ఇప్పటికే వైయస్సార్‌సీపీ కార్యక్రమం
అదే రీకాలింగ్‌ ఆఫ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో
దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు పోవాలి
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మన కార్యక్రమం చేరాలి
అందుకు పార్టీలో సీనియర్‌ నేతలు చొరవ చూపాలి
:శ్రీ వైయస్‌ జగన్‌ దిశా నిర్దేశం

పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి
గ్రామస్థాయిలో వెంటనే పార్టీ కమిటీలు ఏర్పడాలి
ఆ వెంటనే బూత్‌ కమిటీల నిర్మాణం జరగాలి
గ్రామస్థాయిలోనూ పార్టీ అనుబ«ంధ విభాగాలు
యువజన, మహిళ, విద్యార్థి, సోషల్‌ మీడియా..
రైతు, కార్మిక విభాగాలు ఏర్పాటు కావాలి
అలా ప్రతి గ్రామంలోనూ విభాగాల అధ్యక్షులు
తద్వారా మరింత బలంగా వైయస్సార్‌సీపీ
:శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి

త్వరలోనే ప్రత్యేకంగా ఒక యాప్‌ విడుదల
వేధింపులకు గురైన వారి కోసం ఆ యాప్‌
అలాగే అన్యాయానికి లోనైన వారూ ఫిర్యాదు చేయొచ్చు
ఆ యాప్‌లో ఆ బాధితులంతా ఫిర్యాదు చేయొచ్చు
వీలుంటే ఆధారాలు కూడా అప్‌లోడ్‌ చేయాలి
అవన్నీ ఇక్కడి సర్వర్‌లో డిజిటల్‌ లైబ్రరీలో నిక్షిప్తం
ప్రభుత్వం రాగానే బాధ్యులందరిపైనా తగిన చర్యలు
తప్పు చేసిన వారందరినీ చట్టం ముందు నిలబెడుతాం
:సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటన

తాడేపల్లి:
మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఎసీ) సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది.

పీఏసీలో ప్రస్తావించిన అంశాలు:
టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు. అక్రమ కేసులు, అరెస్టులు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం. వైయస్సార్‌సీపీలో చురుకుగా వ్యవహరిస్తున్న వారు టార్గెట్‌గా కొనసాగిస్తున్న వేధింపులు. ఇంకా సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం. చంద్రబాబు చేసిన, చేస్తున్న మోసాలను ప్రజల్లో ఇంకా ఎండగట్టడం. బాబూ ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని మిగిలిన గ్రామాల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు.

పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..:
రాక్షస పాలన ఎదుర్కొంటున్నాం:
ఈ మీటింగ్‌ నెలకోసారి అయినా జరిగేలా చూస్తాము. సూచనలు, సలహాల కోసం పార్టీలో సీనియర్లను పీఏసీలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు అందరికీ తెలుసు. మనం ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. చూస్తుండగానే దాదాపు ఏడాదిన్నర గడిచింది. ఇంకా మనకు మిగిలింది మూడేళ్లు మాత్రమే. మనం ఇప్పుడు రాక్షస పాలన చూస్తున్నాం. దాన్ని ఇంకా ఎదుర్కోవాల్సి ఉంది.

అక్రమ కేసులు. అరెస్టులు:
మన పార్టీ సీనియర్‌ నాయకులను జైళ్లలో పెడుతున్నారు. భవిష్యత్తులో మనం ఇదే సంప్రదాయం కొనసాగిస్తే, టీడీపీ సీనియర్‌ నాయకులంతా జైళ్లలోనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మన లీడర్లను అన్యాయంగా జైళ్లలో పెట్టారు.
మిధున్‌రెడ్డిని చూస్తే బాధనిపిస్తోంది. ఆయన్ను నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. అదే విధంగా మేకపాటి గౌతమ్‌రెడ్డిని కూడా నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. వారి తండ్రులు మా నాన్న బ్యాచ్‌. వారిద్దరూ నా బ్యాచ్‌. నా ఫ్రెండ్స్‌. కేవలం వేధించడం కోసమే మిధున్‌రెడ్డిని అరెస్టు చేసి, జైల్లో పెట్టారు. ఆయన కనీసం ఇక్కడ మంత్రి కూడా కాదు. ఆయన తండ్రి రామచంద్రన్న ఎక్సైజ్‌ మంత్రి కూడా కాదు.
అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఆయన కర్మ ఏమిటంటే, అది చంద్రబాబునాయుడు నియోజకవర్గం. అక్కడ మంత్రిగా ఉండి కూడా చంద్రబాబునాయుడు ఓడిపోయాడు. 1978లో ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి గెల్చి, మంత్రిగా ఉండి కూడా పోటీ చేసి, 1983 లో ఓడిపోయాడు. ఆ తర్వాత తన మామ కాళ్లు వేళ్లూ పట్టుకుని టీడీపీలో చేరి, పోటీ చేశాడు. ఆ తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు. చంద్రగిరిలో తన ప్రత్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కాబట్టి, టార్గెట్‌ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన కొడుకును కూడా వేధించి అరెస్డు చేయాలని చూస్తున్నారు.
అలాగే నందిగం సురేష్‌. దళితుడు. ఎంపీగా ఎదిగాడు. 6 నెలల 10 రోజులు. మొత్తం 191 రోజులు జైల్లో పెట్టారు. ఒక కేసు కాగానే మరో కేసు పెట్టి జైల్లో ఉంచారు. ఇంకా కాకాణి గోవర్థన్‌రెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేశారు. క్వార్ట్‌›్జ గనుల కేసు. టోల్‌గేట్‌ కేసు. వరసగా కేసులు పెట్టి, వేధిస్తున్నారు. ఇప్పటికే జైల్లో పెట్టారు. ఇప్పుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ టార్గెట్‌. ఆయననూ అరెస్టు చేయాలని చూశారు. కానీ, ఆ కుట్రలో భాగంగా ముందుగా అరెస్టు చేసిన వ్యక్తి (శ్రీకాంత్‌రెడ్డి) అదృష్టవశాత్తూ జడ్జీ ముందు నోరు విప్పి పోలీసులు తనను ఎలా హింసించారనేది చెప్పడంతో, అనిల్‌కుమార్‌ అరెస్టు కాలేదు.

వారందరి గొంతు నొక్కే ప్రయత్నం:
ప్రజల తరపున మాట్లాడే వారిని, ప్రజా సమస్యలు ప్రస్తావించే వారిని ఇలా వేధించడం ఇదే మొదటిసారి. నిజానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి, సుపరిపాలన అందిస్తే, ఇలాంటి చర్యలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏ హామీ కూడా అమలు చేయకపోవడంతో, ప్రజల వద్ద ముఖం చెల్లక, ఇలా ప్రశ్నించేవారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశలోనే జోగి రమేష్‌ కొడుకును అరెస్టు చేయడం.. రోజాను కూడా వేధించడం, ఆనందం పొందడం.. ఇంకా విడదల రజని. ఆమెమీదా కేసు పెట్టారు. వేధించే ప్రయత్నం చేస్తున్నారు.
నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి దారుణం. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో విధ్వంసం చేశారు. అదృష్టవశాత్తూ అప్పుడు ఆయన ఇంట్లో లేరు. ఒకవేళ ఆయన ఇంట్లో ఉండి ఉంటే చంపే వారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. కారును కూడా పడదోశారు. దాడిపై ఆయన ఫిర్యాదు చేస్తే, పట్టించుకోని పోలీసులు.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేయగానే తిరిగి ఆయనపైనే చర్య తీసుకున్నారు.
తాడిçపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఆయన్ను సొంత ఇంటికి పోనివ్వడం లేదు. పైగా సీఐ గన్‌ చూపి బెదిరిస్తున్నారు.

కొందరు పోలీసుల అవినీతిపర్వం:
మొదటిసారి కొందరు పోలీసులు అవినీతిలో మునిగిపోయారు.
ఒక్కో జోన్‌కు డీఐజీ. ఆయన ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు. వసూళ్లు చేసి, ఎమ్మెల్యేలకు, అక్కణ్నుంచి సీఎంకు, ఆయన కుమారుడికి నిధులు ఇస్తున్నారు. అలా ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహించి, ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం అమ్ముతున్నారు. వారికి పోలీసులు రక్షణగా నిలుస్తున్నారు. ఇసుక దగ్గరుండి అమ్మిస్తున్నారు. ఏ ఒక్క గని కూడా వదలడం లేదు. నేరుగా డీఐజీ డీల్‌ చేస్తున్నాడు, ఎమ్మెల్యేకు ఇంత. సీఎంకు ఇంత. ఆయన కొడుక్కి ఇంత అని ఇస్తున్నారు. ఇందులో డీఎస్పీ, సీఐలకూ వాటా వెళ్తోంది. ఇంత అవినీతి గతంలో ఎక్కడా లేదు. చూడలేదు.

హామీలన్నీ గాలికొదిలేశారు:
ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. 18 ఏళ్లకు మించిన ఆడవాళ్లు రాష్ట్రంలో 2.10 కోట్లు. వారికి నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు. ఇంకా ఇప్పుడు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే, రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు. మరి ఎందుకు హామీ ఇచ్చినట్లు. అమ్మ ఒడి తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఇచ్చినా 30 లక్షల మందికి తగ్గించాడు. రూ.15 వేలు ఇస్తామని చెప్పినా ఇవ్వకపోగా, రూ.13 వేలు అని చెప్పారు. అదీ ఇచ్చారా అంటే అదీ లేదు. రూ.8500 చొప్పున ఇచ్చారు.
బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీలో మనం ఇవన్నీ పెట్టి, ప్రజలకు వివరిస్తున్నాం. రాష్ట్రంలో తొలిసారి పిల్లలు చదువు మానేస్తున్నారు. పిల్లలకు విద్యాదీవెన లేదు. 2024 లో జనవరి–మార్చి త్రైమాసికం మొదలు, ఇప్పటి వరకు మొత్తం ఆరు క్వార్టర్లు పెండింగ్‌. రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4200 కోట్లు కావాలి. ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. వసతిదీవెన ఏటా ఏప్రిల్‌లో రూ.1100 చొప్పున ఇవ్వాలి. అది కూడా ఇవ్వకపోవడంతో రెండేళ్లకు రూ.2200 కోట్లు పెండింగ్‌. రెండూ కలిపి మొత్తం రూ.6600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. దీంతో పిల్లలు బడి మానేస్తున్నారు.
ఆరోగ్యశ్రీ నెలకు రూ.300 కోట్లు. 14 నెలల నుంచి పెండింగ్‌. అలా రూ.4200 కోట్లు. ఇచ్చింది రూ.400 కోట్లు కూడా లేదు.
ఆరోగ్య ఆసరాకు ఏటా అయ్యే ఖర్చు రూ.450 కోట్లు. అది ఇచ్చింది లేదు. ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం నిరాకరిస్తున్నాయి.
ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు లేదు. ఏ రైతు పరామర్శకు వెళ్లినా కేసు పెడుతున్నారు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్‌ లేదు. నిరుద్యోగ భృతి దేవుడెరుగు. పిల్లలకు ఏమీ చేయడం లేదు. నాడు–నేడు మనబడి లేదు. అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా?

రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారు:
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మనం 5 ఏళ్లలో ప్రభుత్వం నేరుగా కానీ, కార్పొరేషన్లకు గ్యారెంటీతో కానీ చేసిన మొత్తం అప్పు రూ.3.32 లక్షల కోట్లు అయితే, అందులో 52 శాతం కేవలం ఈ 14 నెలల్లోనే చేశారు. ఏ స్కీమ్‌ లేదు. అయినా రూ.1.75 లక్షల కోట్లు అప్పు చేశారు. మన హయాంలో కోవిడ్‌ రెండేళ్లు. అయినా అన్ని పథకాలు అమలు చేశాం. గ్రామ, వార్డు సచివాలయాలు కట్టాం. ఆర్బీకేలు కట్టాం. పోర్టుల నిర్మాణం చేశాం. స్కూళ్లు బాగు చేశాం. కొత్త మెడికల్‌ కాలేజీలు తెచ్చాం. విలేజ్‌ క్లినిక్స్‌ కట్టాం. పాలనలో విప్లవాత్మక మార్పులు చూపాం.
ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. అవన్నీ వీరి జేబుల్లోకి పోతున్నాయి. అందుకే దేశ ఆదాయం సగటున 12 శాతం పెరిగితే, ఇక్కడ అది కేవలం 3 శాతమే. అంటే ఇక్కడ ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వానికి కాకుండా, వీరి జేబుల్లోకి పోతోంది. అందుకే ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదు. ఇప్పుడు మళ్లీ సింగపూర్‌ పర్యటన. ఈ డబ్బులన్నీ తీసుకుపోయి, దాచి పెట్టుకోవడానికి మాత్రమే, ఈ పర్యటన కనిíపిస్తోంది.

ప్రత్యేక యాప్‌. డిజిటల్‌ లైబ్రరీ:
వచ్చే వారంలో మనం చేసే కార్యక్రమం. ఒక యాప్‌ విడుదల చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా, ఎవరైనా, ఏ కార్యకర్త అయినా అధికారులతో వేధింపులకు గురైతే, లేదా ఏదైనా అన్యాయానికి గురైతే ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఫిర్యాదు చేయొచ్చు. ఎవరితో, ఏ అధికారితో తాను ఇబ్బంది పడింది అన్నది చెప్పొచ్చు. దానికి సంబంధించి ఆధారాలు ఉంటే, వాటినీ అప్‌లోడ్‌ చేయొచ్చు. అవన్నీ మన డిజిటల్‌ లైబ్రరీలోని సర్వర్‌కు చేరుతాయి.
రేపు మన ప్రభుత్వం రాగానే, డిటిజల్‌ లైబ్రరీలో దాన్ని (సర్వర్‌) ఓపెన్‌ చేసి, బాధ్యులైన వారు ఎవ్వరినీ వదలకుండా చట్టం ముందు నిలబెడతాం. సినిమా చూపిస్తాం. వారు చేసినవన్నీ వడ్డీతో సహా చెల్లిస్తాం. ఈరోజు వారు నాటే విత్తనం అదే రేపు పండుతుంది. అందుకే చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం.

బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ సక్సెస్‌:
‘రీకాలింగ్‌ ఆఫ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో’. బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ. కార్యక్రమం బాగా కొనసాగుతోంది. ఇప్పటికే 175 నియోజకవర్గాలకు గానూ, 169 చోట్ల జరిగింది. ఆరు నియోజకవర్గాల్లో వేర్వేరు కారణాల వల్ల ఆలస్యం అయింది. 640 మండలాల్లో దాదాపు 538 మండలాల్లో పూర్తి. మిగిలిన 102 మండలాల్లో వేగంగా పూర్తి చేస్తాం. దాదాపు 90 నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం సాగుతోంది.
మన క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ప్రతి ఇంట్లో ఈ కార్యక్రమం సాగుతుంది. ఆ ఇంటికి చంద్రబాబు ఎంత బాకీ ఉన్నాడు. గత ఏడాది ఎంత ఎగ్గొట్టాడు. ఈ ఏడాది ఎంత బాకీ పడుతున్నాడు.. అనేది చెబుతున్నాం.

సీనియర్లు మరింత చురుగ్గా..:
మీరంతా సీనియర్‌ లీడర్లు. కాబట్టి మీరు కూడా కాస్త చొరవ చూపాలి. మీరు మార్గదర్శకులుగా నిలవాలి. మీ సీనియారిటీని ఉపయోగించాలి. జిల్లా స్థాయిలో అందరితో, నాయకులతో మమేకం కావాలి. మన హానీమూన్‌ పీరియడ్‌ ముగిసింది. కొందరు సీనియర్లు ఇంకా రెస్ట్‌ తీసుకుంటున్నారు. ఇప్పుడు వారంతా రంగంలోకి దిగాలి. పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలి. పార్టీల యువ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తూ, సీనియర్‌ నాయకులంతా పని చేయాలి. అలా మీ సీనియారిటీని చూపాలి.

పార్టీ. వ్యవస్థీకృత విధానం:
రచ్చబండ కార్యక్రమం తర్వాత, గ్రామ కమిటీల ఏర్పాటు జరుగుతోంది. గతంలో మొక్కుబడిగా అవి ఏర్పాటయ్యేవి. ఇప్పుడు వాటి ఏర్పాటులో మన నాయకులు మానిటరింగ్‌ ఉండాలి. గ్రామస్థాయిలో మన కార్యకర్త ఒక వ్యవస్థీకృత విధానంలోకి రావాలి. వారికి మీరు దిశా నిర్దే«శం చేయాలి. లేకపోతే, వారు ఈత కొట్టినా ముందుకు పోరు. వారు ముందుకు కదలాలంటే, గ్రామ కమిటీలను మనం మరింత వ్యవస్థీకృత విధానంలోకి తీసుకురావాలి.
ఇప్పుడు చంద్రబాబునాయుడు చేసిన మోసం స్పష్టంగా కనిపిస్తోంది. అదే మనం ఉంటే, అన్నీ దక్కేవని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు రావడంతో బిర్యానీ మాట దేవుడెరుగు. పలావ్‌ కూడా పోయింది అని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మీరు మూవ్‌ కావాలి. మరింత అగ్రెస్సివ్‌గా పని చేయాలి. కార్యకలాపాల్లో పాల్గొనాలి.
అవన్నీ సక్రమంగా జరగాలంటే, గ్రామ కమిటీల ఏర్పాటు కూడా పూర్తి కావాలి. ఈ పనిలో ఎక్కడా మీరు వెనక్కు తగ్గొద్దు.

ఎక్కడా అలసత్వం చూపొద్దు:
అందరినీ కలుపుకుని పోదాం. అక్కడే మన పెద్దరికం చూపుదాం.
దీని వల్ల పార్టీలో కిందిస్థాయి వారికి వే«ధింపులు పోతాయి. మనమూ ఎదుగుతాం. మన వ్యవస్థ. జిల్లా అధ్యక్షులు. రీజినల్‌ కోఆర్డినేటర్లు. పార్లమెంటు నియోజవర్గాల ఇంఛార్జ్‌లు.. అందరూ వారి వారి స్థాయిలో క్రియాశీలకంగా మారాలి. మరింత చొరవతో పని చేయాలి. ఆ మేరకు యాక్టివ్‌ కావాలి.
మీరంతా సీనియర్లు. మీరు ఎప్పుడైతే యాక్టివేట్‌ అవుతారో.. జూనియర్‌ నాయకులూ చొరవ చూపుతారు. ముందుకు వచ్చి పని చేస్తారు. కాబట్టి, మీరు ఎక్కడా ఎలాంటి అలసత్వం చూపొద్దు. చొరవ చూపాలి. యాక్టివ్‌ కావాలి. కష్టపడాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం వస్తుంది. ఆ సమయంలోనే మనకు గ్రామాలపైనా, పార్టీ కార్యకర్తలపైనా స్పష్టమైన అవగాహన వస్తుంది. ఎవరు, ఎలా కష్టపడుతున్నారనేది తెలుస్తుంది. వారందరినీ వ్యవస్థీకృత విధానంలోకి తీసుకొస్తే, అన్నీ సక్రమంగా జరుగుతాయి.

కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం:
కార్యకర్తలకు మంచి ఇన్సూరెన్స్‌ కల్పిస్తాం. మన పార్టీకి 15 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రజల్లో మనం బలంగా ఉన్నాం. ఇంకా బలోపేతం కావాలి.
కాబట్టి, గ్రామ కమిటీలే ఏర్పాటు కాగానే, బూత్‌ లెవెల్‌ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. మన పార్టీ మరో 30, 40 ఏళ్లపాటు కొనసాగాలంటే, కార్యకర్తలు చాలా ముఖ్యం. మనం వారికి తోడుగా, అండగా ఉన్నామన్న విశ్వాసం కల్పించాలి. గతంలో మన ప్రభుత్వ హయాంలో కోవిడ్‌ వల్ల, కార్యకర్తలను అంతగా పట్టించుకోలేకపోయాం. కానీ, ఈసారి అలా కాదు. వారికి చాలా ప్రాధాన్యం ఇస్తాం.

గ్రామస్థాయిలోనూ అనుబంధ కమిటీలు:
బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ మరింత ఎఫెక్టివ్‌గా తీసుకెళ్లాలి. అందుకే ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాలి. ప్రతి ఊళ్లో కార్యక్రమం జరగాలి. ప్రతి ఊళ్లో గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. రాబోయే కార్యక్రమాలకు ఇదే నాంది కావాలి.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. విన్‌ వన్‌సైడ్‌ ఉంటుంది. మొత్తం సీట్లు ఎప్పుడు గెలుస్తామంటే.. గ్రామస్థాయిలో కూడా పార్టీ నిర్మాణం బాగా జరగాలి. ప్రతి ఊళ్లో కనీసం 10 మందిని (గ్రామ కమిటీ సభ్యులు) ఆ ప్రాంత ఎమ్మెల్యే గుర్తు పట్టాలి. పేరు పెట్టి పిల్చేలా ఉండాలి.
అలాగే గ్రామ కమిటీల తర్వాత, బూత్‌ కమిటీల నిర్మాణం జరగాలి. అలా ఒకవైపు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేస్తూనే, మరోవైపు ప్రజల్లో మరింత మమేకమై పని చేయాలి.
అదే విధంగా ప్రతి గ్రామంలో మనకు యువజన, మహిళ, విద్యార్థి, సోషల్‌ మీడియా, రైతు, కార్మిక విభాగాల కమిటీలు ఉండాలి. అలా ప్రతి గ్రామంలో ప్రతి వింగ్‌కు సంబంధించి, మన పార్టీ ప్రతినిధులు ఉంటే.. మరింత బలపడతాం. ఇవన్నీ చేయడం వల్ల, క్రియాశీలక కార్యకర్తలను ఉత్తేజపర్చినట్లు ఉంటుంది. నేను ఫలానా గ్రామంలో మహిళా అధ్యక్షురాలిని. నేను విద్యార్థి విభాగం నాయకుడిని.. అని ఎవరికి వారు చెప్పుకోవచ్చు. వారికి ఐడీ కార్డు కూడా ఇవ్వాలి. దాని వల్ల వారిని ప్రోత్సహించినట్లు అవుతుంది. దీని వల్ల పార్టీ ఏ కార్యక్రమం చేసినా, సక్సెస్‌ అవుతుంది.
అనుబంధ విభాగాలు పక్కాగా ఏర్పాటు చేస్తే, ప్రతి గ్రామంలో అలా ఆరు నుంచి ఏడు కమిటీలు ఏర్పాటు చేస్తే, 13 వేల గ్రామాల్లో ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షులే దాదాపు 80 వేల మంది ఉంటారు. ఇక ఆయా ఆర్గనైజేషన్లలో సభ్యులు సంఖ్య కూడా సరేసరి.
అలా మన పార్టీ గ్రామస్థాయిలో ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. ఎదగాలి. కావాలంటే, రెండు మూడు నెలల టైమ్‌ తీసుకొండి. ఈ కార్యక్రమం పూర్తయ్యేలోపు.. రచ్చబండ నిర్వహించి, గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి. ఆ మేరకు కమిటీల నియామకాలు జరగాలి. అందుకు మీరు విస్తృతంగా పర్యటించాలి. ప్రజలను కలవాలి. వెనువెంటనే గ్రామాల్లో కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలి.
పార్టీ 30, 40 ఏళ్లు కొనసాగాలి. అదే నా లక్ష్యం. అందుకే గ్రామస్థాయిలో కూడా పక్కాగా అన్ని కమిటీల నిర్మాణం జరగాలి.
పార్టీని వ్యవస్థీకృతంగా బలంగా తయారు చేయాలి.

చివరగా..
ఇప్పుడు మన కార్యక్రమం. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’. దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇంకా ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఓపెన్‌ చేసుకునేలా పార్టీ సీనియర్‌ నేతలంతా చొరవ చూపాలని, వారికి దాని ప్రాముఖ్యత గురించి చెప్పాలని శ్రీ వైయస్‌ జగన్‌ నిర్దేశించారు.

(బాక్స్‌ ఐటెం)
జగన్‌ భద్రతపై ఆందోళన:
కాగా, ఇటీవలి పర్యటనల్లో శ్రీ వైయస్‌ జగన్‌కు ప్రభుత్వం తగిన భద్రత కల్పించకపోవడంపై సమావేశంలో పీఏసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటన సందర్భంగా పోలీసులు చూపిన నిర్లక్ష్యాన్ని సమావేశంలో సభ్యులు ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఆయనకు తగిన భద్రత కల్పించడం లేదని తేల్చి చెప్పారు. జగన్‌గారి భద్రతపై వినిపిస్తున్న కథనాలు తమను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో జగన్‌గారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ పీఏసీ సభ్యులు స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version