ఉదయం సంక్షేమం… సాయంత్రం అభివృద్ధిసంపద సృష్టికి దారులు… రహదారులేగడ్కరీ అంటే పట్టుదల, కృషి, వేగం, అంకితభావం

0

Press Release

ఉదయం సంక్షేమం… సాయంత్రం అభివృద్ధి

సంపద సృష్టికి దారులు… రహదారులే

గడ్కరీ అంటే పట్టుదల, కృషి, వేగం, అంకితభావం

సీఎం అడిగిన వెంటనే వేదిక పైనే రూ. 26 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మరో రూ. 1 లక్ష కోట్ల ప్రాజెక్టుల మంజూరుకు గడ్కరీ అంగీకారం

ఏపీని మీ సొంత రాష్ట్రంగా భావించండంటూ గడ్కరీని కోరిన సీఎం

నేషనల్ హైవే ప్రాజెక్టులకు భూ సేకరణలో పూర్తిగా సహకరిస్తాం

రూ. 2852 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులను జాతికి అంకితం

రూ. 2381 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

జాతీయ రహదారుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 2: సంపద సృష్టికి మార్గాలు రహదారులేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రహదారులను నిర్మించడంలో దేశంతోపాటు.. ఏపీలో కూడా ప్రణాళికలను సిద్దం చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. శనివారం రోడ్ రవాణ, రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి రాష్ట్రంలో మొత్తంగా రూ. 5233 కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన.. రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఉదయం అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని రైతులకు డబ్బులు రైతుల ఖాతాలో వేశామని.. సాయంత్రం సంపద సృష్టికి మార్గమైన రహదారుల శంకుస్థాపన వంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నానని.. అందుకే ఇది చరిత్రాత్మకమైన రోజని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో మరో రూ. 26 వేలకోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు కేంద్ర మంత్రి గడ్కరీ ముందుంచారు. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి.. వేదిక మీద నుంచి ఆ ప్రాజెక్టులకు అంగీకారం తెలిపారు. ఇంతే కాకుండా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా మరో రూ.1 లక్ష కోట్ల మేర ప్రాజెక్టులను ఆమోదించేందుకు సిద్దంగా ఉన్నామని గడ్కరీ చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి గడ్కరీ చేసిన సేవలను గుర్తు చేశారు. రాష్ట్రానికి మరింత సాయం అందించాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. “గడ్కరీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పోలవరానికి ఆక్సిజన్ ఇచ్చారు.. ఓ రూపం ఇచ్చారు. గడ్కరీ అంటే పట్టుదల, కృషి వేగం, అంకిత భావం. గడ్కరీ మాటల్లో.. చేతల్లో అభివృద్ధి కన్పిస్తుంది. అభివృద్ధిని కోరుకునే వారు గడ్కరీ మాటలను సంగీతాన్ని ఆస్వాదించినట్టు ఆస్వాదిస్తారు. సహజంగా ఏ మంత్రి అయినా.. తన శాఖ గురించే ఆలోచిస్తారు.. కానీ గడ్కరీ ఆలోచన విధానం అందరికీ భిన్నంగా ఉంటుంది.
గడ్కరీ రోడ్ల గురించే కాకుండా.. రోడ్ల మీద జరిగే ప్రమాదాల నివారణ గురించి కూడా ఆలోచన చేశారు. పొలూష్యన్ ఫ్రీగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్.. గ్రీన్ హైడ్రోజన్.. అది కూడా వ్యవసాయం ఉత్పత్తుల నుంచే రావాలనే ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. నితిన్ గడ్కరీది రీసెర్చ్ మైండ్. ఎప్పుడూ ఏదో సాధించాలనే తపన ఆయనలో కన్పిస్తుంది. సాగరమాల.. భారత మాల వంటి ప్రాజెక్టులను రూపకల్పన చేశారు. గతంలో నెల్లూరు నుంచి తిరుపతి పోవాలంటే పది గంటలు పట్టేది.. గుంతల మయంగా ఉండేది.. కానీ ఇప్పుడా సమస్య తప్పింది. ప్రపంచంలో రోడ్ల ఇన్ఫ్రాలో దేశాన్ని నెంబర్-1 చేసే సామర్ధ్యం గడ్కరీకే ఉంది. గత ఐదేళ్లల్లో ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని రోడ్లు శిధిలావస్థకు చేరాయి.. కానీ జాతీయ రహదారులు మాత్రం బాగున్నాయి. 2014 నాటికి ఏపీలో 4193 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండేవి. వాటిని 8745 కిలో మీటర్లకు చేర్చిన ఘనత గడ్కరీదే. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 70 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.11 వేల కోట్ల విలువైన 760 కిలో మీటర్ల రోడ్లను నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేశాం. ఈ ఏడాదిలో రూ. 15 వేల కోట్ల విలువైన వేయి కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం.” అని చంద్రబాబు అన్నారు.

జాతీయ రహదారుల ప్రాజెక్టులకు పూర్తిగా సహకరిస్తాం

“జాతీయ రహదారుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా సహకరిస్తాం. నేషనల్ హైవేల నిర్మాణం కోసం భూసేకరణతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం. ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తాం. రవాణ ఖర్చులు తగ్గించేలా గడ్కరీ కూడా ఆలోచన చేస్తున్నారు. అన్ని రకాల రవాణా మార్గాలను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ఏపీకి వేయి కిలో మీటర్ల తీర ప్రాంతం ఉంది. ప్రతి 50 కిలో మీటర్లకు ఓ పోర్టు ఉండాలి. ఇప్పటికే పోర్టులే కాకుండా.. త్వరలో ఇంకొన్ని పోర్టులు అందుబాటులోకి రాబోతున్నాయి. రాబోయే కాలంలో హబ్ అండ్ స్పోక్ పద్దతిన రాష్ట్రంలో 20 పోర్టులను అందుబాటులోకి తెస్తాం. అలాగే ఎయిర్ పోర్టులు కూడా పెద్ద ఎత్తున నిర్మించాలని ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతమున్నవి కాకుండా.. మరో 9 ఎయిర్ పోర్టులు నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నాం. ఇది జరిగితే.. ఏపీ లాజిస్టిక్ హబ్ గా ఉంటుంది. భారత తూర్పు తీరానికి గేట్ వేగా ఉంటుంది. 2014-19 మధ్య కాలంలో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేశాం. కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ వరకు జలరవాణకు పైలెట్ ప్రాజెక్టుతో చేపట్టాలని భావించాం. అలాగే బకింగ్ హ్యాం కెనాల్ ద్వారా కాకినాడ నుంచి చెన్నైకు కూడా జలరవాణ ప్రాజెక్టు అమలుకు సిద్దపడ్డాం. కానీ ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టులు పక్కన పెట్టేశారు. మళ్లీ ఆ ప్రాజెక్టులను చేపట్టాలి. డ్రై పోర్టులు కూడా నిర్మించాలనే యోచన చేస్తున్నాం. రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. దీనికి కేంద్రం సపోర్ట్ కావాలి.” అని చంద్రబాబు కోరారు.

గడ్కరీ స్పూర్తితో హైదరాబాద్ ఓఆర్ఆర్

గడ్కరీ మహారాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడే 1977-78 కాలంలో ముంబై నుంచి పుణే వరకు పీపీపీ పద్దతిన రహదారి నిర్మించారు. ఆ స్పూర్తితోనే నేను కూడా హైదరాబాదులోని ఓఆర్ఆర్ ను కూడా పీపీపీ పద్దతిన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశాం. 163 కిలోమీటర్లతో హైదరాబాద్ ఓఆర్ఆర్ నిర్మాణానికి నాడు రూపకల్పన చేశాం. ఇప్పుడు అమరావతికి 189 కిలో మీటర్ల మేర ఓఆర్ఆర్ అడిగాం.. దానికి అంగీకరించారు. ఏడు జాతీయ రహదారులను ఔటర్ రింగ్ రోడ్ అనుసంధానం చేస్తుంది. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైళ్ల నిర్మాణం చేపడుతున్నాం.. దీనికి కేంద్రం సహకరిస్తుంది.
గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ గురించి గడ్కరీ చెప్పారు. ప్రతి ఇంటిపైనా కరెంట్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాం. పీఎం సూర్య ఘర్, కుసుం పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నాం. వికసిత్ భారత్.. స్వర్ణాంధ్ర జయప్రదం కావాలంటే.. రోడ్లు.. పోర్టులు.. ఎయిర్ పోర్టులు.. ఇన్ ల్యాండ్ వాటర్ వేస్.. రైల్వేల మీద శ్రద్ధ పెట్టాలి. దక్షిణాదిలో అమరావతి-చెన్నై-బెంగళూరును కవర్ చేస్తూ బుల్లెట్ రైలు వేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ఇది దేశ ఆర్థిక ప్రగతికి తొడ్పడుతుంది. ఐదు కోట్ల మందిని కవర్ చేస్తుంది.
ఇలాంటి ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయాలి. జాతీయ రహదారులకు రెండు వైపులా గ్రీనరీ పెంచేందుకు అవసరమైన నిధులివ్వాలి” అని చంద్రబాబు కోరారు.

మహారాష్ట్రతో పాటు ఏపీని మీ సొంత రాష్ట్రంగా భావించండి

“కేంద్ర మంత్రి గడ్కరి మహారాష్ట్రతో పాటు ఏపీని సొంత రాష్ట్రంగా భావించాలి. మహారాష్ట్ర కంటే ఎక్కువగా ఏపీ నుంచి సహకారం అందిస్తాం. సమర్ధవంతమైన నాయకత్వం… దూరదృష్టి కలిగిన నేతగా మాకు సేవలు అవసరం. ఎంపీలు అడిగిన ప్రాజెక్టులన్నీ ఇచ్చారు. గడ్కరీ ఆలోచనలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది.” అని సీఎం అన్నారు.

సీఎం అడిగిన వెంటనే గడ్కరీ మంజూరు చేసిన ప్రాజెక్టులివే..

హైదరాబాద్ – విజయవాడ రోడ్డు 6 లేన్లు – రూ.6700 కోట్లు
విజయవాడ – మచిలీపట్నం రోడ్డు 6 లేన్లు -రూ.2600 కోట్లు
వినుకొండ- గుంటూరు రోడ్డు 4 లేన్లు – రూ.2605 కోట్లు
గుంటూరు -నిజాంపట్నం రోడ్డు 4 లేన్లు – రూ.2000 కోట్లు
బుగ్గకయిప – గిద్దలూరు రోడ్డు 4 లేన్లు -రూ.4,200 కోట్లు
ఆకివీడు- దిగమర్రు రోడ్డు 4 లేన్లు -రూ.2500 కోట్లు
పెడన – లక్ష్మీపురం రోడ్డు 4 లేన్లు -రూ.4,200 కోట్లు
ముద్దునూరు -కడప రోడ్డు 4 లేన్లు -రూ.1182 కోట్లు
హైదరాబాద్ -విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version