పవన్ తనను రౌడీ అన్నారని శ్రీనివాస్ మండిపాటు

Spread the love

 


తనపై తీవ్ర విమర్శలు గుప్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. గత నెలలో భీమవరంకు వచ్చినప్పుడు తనపై కోపం లేదని అన్నారని… ఇప్పుడేమో తనను రౌడీ అంటున్నారని విమర్శించారు. భీమవరంలో స్థలం కొందామనుకుంటే తాను అడ్డుకున్నానని అంటున్నారని… ఆయన మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు. ప్రపంచ కుబేరులు భీమవరంలో ఉన్నారని పవన్ అన్నారని… భీమవరంలో అటువంటివారు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తన మీద పవన్ కు ఎందుకంత అసూయ అనేది తనను అర్థం కావడం లేదని చెప్పారు. నీకు స్థలం కావాలంటే నాకున్న తొమ్మిది ఎకరాల్లో ఎక్కడ కావాలో చెపితే అక్కడ ఇస్తానని తెలిపారు. 


జనసేన కార్యకర్తలు తనకు సలహాలు ఇవ్వొద్దని పవన్ డైరెక్ట్ గా చెపుతున్నారని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఆయనను ఇష్టపడే వ్యక్తులకు ఆయనతో కలిసి సెల్ఫీ దిగే అవకాశం కూడా ఉండదని చెప్పారు. పవన్ నిజ స్వరూపం తెలియని అభిమానులు సీఎం సీఎం అంటుంటారని… నువ్వు మాత్రం 21 సీట్లకే పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావని ఎద్దేవా చేశారు.


చిరంజీవికి, పవన్ కల్యాణ్ కు అసలు పోలికే లేదని శ్రీనివాస్ అన్నారు. చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు గెలిచారని… పవన్ మాదిరి విమర్శలు చేయలేక రాజకీయాల నుంచి వెళ్లిపోయారని చెప్పారు. సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారని దుయ్యబట్టారు. 2019లో ఓడిపోయిన తర్వాత మళ్లీ భీమవరం ముఖమే చూడలేదని… కరోనా టైమ్ లో కూడా ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. తనను రౌడీ అని పవన్ అంటున్నారని… తన మీద ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని చెప్పారు. తన గురించి భీమవరం ప్రజలను అడిగితే చెపుతారని అన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *