ప్రవాసాంధ్రులకు ఇకపై రోజు 100 వీఐపీ శ్రీవారి దర్శనం టికెట్లు
ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి టీటీడీ ఇకపై రోజూ వంద వీఐపీ బ్రేక్ టికెట్లు జారీ చేయనుంది. ఈ నూతన విధానాన్ని సోమవారం నుంచి టీటీడీ అమల్లోకి తీసుకురానుంది. 2019 ముందు వరకు వారంలో ఐదు రోజుల పాటు రోజూ 50 మంది ప్రవాసాంధ్రులకు ఏపీ ఎన్నారై తెలుగు సొసైటీ సిఫార్సుతో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ కల్పించేది. వారితోపాటు కుటుంబ సభ్యులను అనుమతించేవారు. తర్వాత ఆ కోటాను రోజుకు 12 మందికి పరిమితం చేశారు. కుటుంబ సభ్యులనూ అనుమతించలేదు. ఈ క్రమంలో నుంచి దర్శన కోటాను పెంచాలని తానా విజ్ఞప్తి చేసింది. గతేడాది నవంబరు 7న సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలోనూ ఏపీ ఎన్నారై తెలుగు సొసైటీ దర్శన కోటాను పెంచాలని విన్నవించారు. వారితో పాటు కుటుంబ సభ్యులను, ముఖ్యంగా వయసైన తల్లిదండ్రులను, అత్తమామలను అనుమతించాలని కోరడంతో సీఎం అంగీకరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి టీటీడీకి ఫిబ్రవరి 6న ఆదేశాలు అందాయి.