*ఎన్టీఆర్ జిల్లా, మార్చి 01, 2025*
ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
శనివారం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడలోని ఎస్ఆర్ఆర్-సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకున్న చర్యలతో పాటు వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలతో పాటు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సిట్టింగ్ స్వ్కాడ్ వివరాలు అడిగి తెలుసుకొని.. చీఫ్ సూపరింటెండెంట్తో సహా ఇన్విజిలేటర్లు, పరీక్షా విధులకు కేటాయించిన ప్రతిఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీచేసి మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు గదుల్లో గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలని.. ఏమాత్రం ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. ఇంటర్మీడియెట్ విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీస్, ప్రజా రవాణా, వైద్య ఆరోగ్యం, విద్యుత్, పోస్టల్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. శనివారం ప్రారంభమైన ఇంటర్ థియరీ పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు 103 కేంద్రాల్లో జరుగుతాయని.. పరీక్ష పత్రాలను స్టోరేజ్ పాయింట్ల నుంచి పరీక్షా కేంద్రాలకు తరలింపు మొదలు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు వివరించారు.
*తొలిరోజు ప్రశాంతం:* తొలిరోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తెలుగు/సంస్కృతం/హిందీ/ఉర్దూ పరీక్షకు 40,695 మందికి గాను 39,737 మంది హాజరయ్యారు. 958 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదు. నాలుగు ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాలతో పాటు పలు సిటింగ్ స్వ్కాడ్స్ విధుల్లో పాల్గొన్నాయి.