*ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 21, 2024*
హస్తకళాభిమానులను అలరించనున్న లేపాక్షీ గాంధీ శిల్ప్ బజార్
ఈ నెల 22 నుంచి డిసెంబర్ 1 వరకు హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు.
– ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఎస్.సవిత, సత్యకుమార్ యాదవ్.
– లేపాక్షీ ఎండీ ఎం.విశ్వ
హస్తకళాభిమానులను అలరించేలా ఈ నెల 22వ తేదీ నుంచి విజయవాడ, మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో లేపాక్షీ గాంధీ శిల్ప్ బజార్ను ఏర్పాటుచేస్తున్నామని.. ప్రదర్శనను 22న రాష్ట్ర మంత్రులు ఎస్.సవిత, సత్యకుమార్ యాదవ్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభిస్తారని ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీ హెచ్డీసీ) లిమిటెడ్ వీసీ, ఎండీ ఎం.విశ్వ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న గాంధీ శిల్ప్ బజార్ ఎగ్జిబిషన్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు కళానైపుణ్యంతో తయారుచేసిన ఉత్పత్తులను దాదాపు 100 స్టాళ్ల ద్వారా ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. టెక్స్టైల్స్, ఎంబ్రాయిడరీ, గ్రాస్ లీఫ్, ఇమిటేషన్ జువెలరీ, కార్పెట్స్, లెదర్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, టై అండ్ డై చీరలు, ఉడ్ కార్వింగ్, లేస్ బ్యాగులు, డ్రెస్ మెటీరియల్స్, కొండపల్లి బొమ్మలు, బాటిక్ ప్రింట్స్ వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ప్రాయోజికత్వంతో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో లేపాక్షీ గాంధీ శిల్ప్ బజార్ను నిర్వహించడం జరుగుతుందని.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఎస్.సవిత, సత్యకుమార్ యాదవ్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తదితర ప్రజాప్రతినిధులతో పాటు టెక్స్టైల్స్, చేనేతతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారని విశ్వ వెల్లడించారు.