ది.25.05.2024
సిసి ఫుటేజ్ లోకేష్ కి ఎలా వెళ్ళింది ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉండాల్సిన సిసి పుటేజి లోకేష్ కి ఎలా వెళ్ళిందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. టీడీపీ పార్టీ బీజేపీ తో పొత్తు పెట్టుకుందే ఎన్నికల కమిషన్ ద్వారా తమకు అనుకూలంగా పనులు చేయించుకునేందుకు అని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజి లోకేష్ కు వెళ్లిందంటే ఎన్నికల కమిషన్ ఏవిధంగా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యిందో మరోసారి రుజువైందన్నారు. పిన్నెల్లి సిసి ఫుటేజిని తాము విడుదల చేయలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా స్పష్టం చేశారన్నారు. లోకేష్ కు ఆ పుటేజీ ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. తక్షణమే కేంద్ర ఎన్నికల కమిషన్ వారి అధీనంలో ఉండాల్సిన సీసీ ఫుటేజీ లోకేష్ కు ఎలా వెళ్ళిందో విచారణ జరిపి లోకేష్ పై చర్యలు తీసుకోవాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ తో తెలుగుదేశం కుమ్మక్కయి తమ అనుకూలంగా పోలీస్ అధికారులును నియమించుకున్న చోట్ల ఘర్షణలు కూడా జరిగాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఓటింగ్ జరిగే రోజు వరకు టిడిపి వారు చెప్పినట్లే ఎలక్షన్ కమిషన్ పని చేసిందని, టీడీపీ వారి దౌర్జన్యాలపై వైసిపి నాయకులు ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని ఆయన అన్నారు. పిన్నెల్లి వీడియోని లోకేష్ పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పటికీ ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి వీడియో బయటకు వచ్చిన కొద్ది నిమిషాలలోనే ఆయన అరెస్టు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చిన ఈసీ, లోకేష్ పై అదే వేగంతో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టిడిపి వారు కూడా అనేక చోట్ల ఈవిఎం లను ధ్వంసం చేశారని, ఆ వీడియోలు కూడా లోకేష్ బయట పెట్టాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.