*ఎన్టీఆర్ జిల్లా, మే 03, 2025*
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 మెయిన్స్ తొలిరోజు పరీక్ష
1,801 మంది అభ్యర్థులకుగాను 1,161 మంది హాజరు
పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీశ
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభం కాగా తొలిరోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, జిల్లాలో మొత్తం 1,801 మంది అభ్యర్థులకుగాను 1,161 మంది (64.46 శాతం) మంది హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. రాత పరీక్ష (ట్యాబ్ ఆధారిత, డిస్క్రిప్టివ్) ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరుగుతుంది. విజయవాడలో ఆరు కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీశ శనివారం ఉదయం బిషప్ అజరయ్య బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఫర్నిచర్, లైటింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, మెడికల్ క్యాంప్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పరీక్ష నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. లైజనింగ్ అధికారులు, అసిస్టెంట్ లైజనింగ్ అధికారులు, సూపర్వైజర్లు తదితరులు పటిష్ట సమన్వయంతో పనిచేయాలన్నారు. భద్రత పరంగా కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.