*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*. *తేదీ.11 .12.2024.*
పార్కింగ్ చేసిన కారు అద్దం పగలగొట్టి బ్యాగ్ ను దొంగతనం చేసిన కేసులో నిందితుడి అరెస్ట్
నిందితుడి వద్ద నుండి సుమారు 1 లక్ష రూపాయలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు ఐపిఎస్ ఆదేశాల మేరకు, క్రైమ్స్ డీసీపీ కే.తిరుమలేశ్వర రెడ్డి ఐపిఎస్, క్రైమ్స్ ఏడీసీపీ ఎం. రాజా రావు పర్యవేక్షణలో క్రైమ్స్ ఏ.సి.పి వెంకటేశ్వర్లు అద్వర్యంలో సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్ రామ్ కుమార్ , వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గురుప్రకాష్ వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దొంగతనాలు చేసే అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ క్రమంలో ది.06.11.2024 తేదిన గుడివాడకు చెందిన ఫిర్యాది తన కారులో విజయవాడ అమ్మవారి దర్శనం నిమిత్తం విజయవాడ వచ్చి తన కారుని రధం సెంటర్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేసి ధర్శనం నకు వెళ్ళినట్లు, దర్శనం అనంతరం వచ్చి చూసుకోనగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన కారు అడ్డం పగలగొట్టి లోపల ఉన్న బ్యాగ్ ను ఎవరో దొంగలించినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై వన్ టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం సి.సి.ఎస్. బృందానికి అప్పగించడం జరిగింది.
దర్యాప్తులో బాగంగా సి.సి.ఎస్. పోలీస్ వారు సంఘటన స్థలం పరిశీలించి అనుమానితుడి కధలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో సిసిఎస్ బృందానికి రాబడిన సమాచారం మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో ది.11.12.2024 తేదిన వన్ టౌన్ తారాపేట రైల్వే స్టేషన్ సమీపంలో తిరుగుతున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారించడం జరిగింది.
విచారణలో నిందితుడు గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామానికి చెందిన ముల్పురి ఫణింద్ర రెడ్డి @ ఫణి (36 సం.) అని, ఇతను క్యాటరింగ్ పని చేస్తున్న క్రమంలో జల్సాలకు అలవాటు పడి సంపాదించిన డబ్బులు తన జల్సాలకు సరిపోక ఏవిధంగానైనా సులభంగా డబ్బులు సంపాదించాలని ఆ క్రమంలో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ది.06.11.2024 తేదిన రధం సెంటర్ సమీపంలో పార్క్ చేసిఉన్న కారును గమనించగా కారులో ఒక బ్యాగ్ కనిపించినట్లు దానిని దొంగిలించాలనే ఉద్దేశంతో కారు అద్దం పగలగొట్టి లోపల ఉన్న బ్యాగ్ ను దొంగిలించాడు. అదేక్రమంలో పక్కనే పార్క్ చేసి ఉన్న మరో కారు అద్దం పగలగొట్టి లోపల ఉన్న రెండు ఫోన్లను దొంగిలించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ఈ క్రమంలో ఈ రోజు తన వద్ద ఉన్న బంగారపు బ్రాస్ లేట్ ను, రెండు సెల్ ఫోన్లను, ఒక నికాన్ కెమెరాను అమ్ముకుని వచ్చిన డబ్బులతో జల్సాలు చేదాం అనుకుని వన్ టౌన్ తారాపేట రైల్వే స్టేషన్ సమీపంలోనికి రాగా సి.సి.ఎస్.పోలీస్ వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారించి అతని వద్ద నుండి సుమారు రెండు లక్షల రూపాయల విలువైన ఒక బంగారపు బ్రాస్ లేట్ (08 గ్రా), రెండు సెల్ ఫోన్లను, ఒక నికాన్ కెమెరాను స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.