ఏపి నూతన డిజిపిగా హరీష్ కుమార్ గుప్తా
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశముంది. 1992 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించనున్నట్లు సమాచారం. తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీవిరమణ తర్వాత ఆయన్ను ఆ పోస్టులో కొనసాగించే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆయన పదవీవిరమణ చేశాక సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్ కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉంటారు. హరీషు కుమార్ గుప్తా రెండోస్థానంలో ఉన్నారు.