06.03.2025
ఆశా వర్కర్లకు గౌరవ వేతనం వెంటనే పెంచాలి
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లకు గౌరవ వేతనం వెంటనే పెంచాలని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక చిరుఉద్యోగులు తమ జీవితాలను సమాజ సేవ కోసం అంకితం చేస్తూనే కనీస వేతనం కూడా అందుకోలేని దుస్థితిలో ఉన్నారని తెలిపారు. అదే గత వైసీపీ ప్రభుత్వంలో ఆశావర్కర్ల జీతం 3 వేల నుంచి 10 వేలకి పెంచుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇవాళ వారిని నడి రోడ్డుకి లాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కోవిడ్ విపత్కర సమయంలో ఆశా వర్కర్ల చేసిన సేవలు వెలకట్టలేనివని.. అయినప్పటికీ వారి సేవలను ఈ ప్రభుత్వం గుర్తించకపోవటం బాధాకరమన్నారు. గర్భిణులు, చిన్నారులు, ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆశావర్కర్లు నేటికీ గౌరవ వేతనంతోనే పనిచేస్తున్నారని.. కనీస వేతన చట్టం ప్రకారం వారికి సరైన జీతాలు అందాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. సమాజానికి అత్యంత కీలకమైన ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే వీరి పట్ల కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని.. కనుక ప్రభుత్వం ఆశా వర్కర్ల గౌరవ వేతనం పెంచుతూ తక్షణమే ప్రకటన చేయాలని కోరారు. అలాగే ఆశా వర్కర్ల 10 ప్రధాన డిమాండ్ లకు గత వైసీపీ ప్రభుత్వం ఆమోదించిందని.. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా ఆ దిశగా కనీసం దృష్టి సారించకపోవటం బాధాకరమన్నారు. తక్షణమే గత ప్రభుత్వం ఆమోదించిన 10 డిమాండ్ లకు వెంటనే జీఓ ఇవ్వాలని డిమాండ్ చేశారు.