జగన్ కు మతిభ్రమించింది
అభివృద్ధి చేస్తూ, సంక్షేమం అందచేస్తున్న కూటమి ప్రభుత్వంపై జగన్ మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నాడు
మంత్రుల ఇళ్లపై దాడులు చేయండి, హత్యలు చేయమంటారా” అన్న జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని మట్టికరిపించే ప్రయత్నం
ఓటమిని జీర్ణించుకోలేని జగన్, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే కుట్రలకు పాల్పడుతున్నాడు, జగన్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు
మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెనకేసుకోస్తున్నావు జగన్…నువ్వసలు మనిషివేనా అంటూ మండిపడ్డ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి / శ్రీకాకుళం, ఆగస్ట్ 1 : ఐదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక, ఆర్దిక వ్యవస్థను నాశనం చేసి, ఆనాటి ప్రతిపక్ష పార్టీ నేతలను, సామాన్య ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసి, 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓటమి చెందటం వలన ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డికి మతి భ్రమించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉంటుంటే అది చూసి ఓర్వలేక, సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే జీర్ణించుకోలేక ప్రజా ప్రభుత్వంపై జగన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆస్తులను లూటీ చేసి, వేల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన అసలైన రూపాన్ని మరోసారి బయటపెట్టారని అన్నారు. రాష్ట్ర మంత్రుల ఇళ్లపై దాడులు చేయండి అనే పిలుపు ఇచ్చిన జగన్ హత్యా రాజకీయాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలే తీర్పు చెప్పారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జరిగిన విపరీతమైన అవినీతిని ప్రజలు మర్చిపోలేరని, ప్రభుత్వ శాఖలన్నింటినీ తన దొంగ రాజకీయాలకు వాడుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే దిశగా రాజకీయ అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నాడని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలను వెనక్కి తొక్కి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, ఉద్యోగాలు, అభివృద్ధిని మట్టికరిపించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇప్పటికీ గుర్తుండిపోయే దాడుల రాజకీయాలను జగన్ రెడ్డి ప్రోత్సహించాడని, అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసారని అన్నారు. గతంలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీను కాపాడిన కార్యకర్తలపై దాడులు చేయించి, హిందూపురం, మంగళగిరి, భీమవరం తదితర చోట్ల ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయించిన గుండా జగన్ రెడ్డి అని మండిపడ్డారు. మీడియా, సోషల్ మీడియా వేదికల్లో ప్రజల స్వేచ్ఛను అణచివేతకు గురిచేసిన సంగతి ప్రతిఒక్కరికి గుర్తు ఉన్నాయని, ఇప్పుడూ అదే ముద్రతో తిరిగి దాడుల రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
అవినీతి పాలనకు మరో పేరు జగన్ రెడ్డి
2024లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు జగన్ రెడ్డికి, ఆయన పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారు. కూటమిని గెలిపించి, అభివృద్ధికి, సంక్షేమానికి ఓటు వేశారు. అయినా తన పరాజయాన్ని జీర్ణించుకోలేని జగన్, ఇప్పుడు అశాంతిని రెచ్చగొట్టే కుట్రలు చేస్తుండటం దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోకపోతే ప్రజలు ఓట్లు కాదు కదా కనీసం రోడ్లమీద కూడా తిరగనివ్వరని పరిస్థితి తలెత్తుతుందన్నారు. అవినీతి పరులను, దొంగలను, బెట్టింగ్ ఆడే వారిని, సంస్కారం లేని వ్యక్తులను వెనకేసుకొచ్చే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంత్రి చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. ఒక మహిళ శాసనసభ్యురాలని అసభ్యకరంగా మాట్లాడి, వ్యక్తిగతంగా దూషించిన ప్రసన్నకుమార్ రెడ్డిని, అవినీతి చేసి జైలు లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి రావడం విడ్డూరంగా ఉందన్నారు. తన కారు కింద పడి మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించలేని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన గంజాయి ముఠా నాయకులను, రౌడీ షీటర్ లను,మదమెక్కి స్త్రీలను అగౌరవంగా మాట్లాడుతున్న సంస్కారం లేని నాయకులను పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. టీ దుకాణాలు మొదలు మల్టీ నేషనల్ కంపెనీల నుంచి వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు కలెక్షన్లు వసూలు చేశారని ఇవ్వని కంపెనీలను బెదిరించి రాష్ట్రం వదిలి వెళ్ళే విధంగా చేశారని వారి అవినీతిలో జగన్మోహన్ రెడ్డికి కూడా వాటా వెళ్లిందని ఆరోపించారు.
శాంతి, భద్రతలకు కట్టుబడి ఉన్నాం
కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితంగా పని చేస్తోంది. పింఛన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్స్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, డ్రోన్ సాయంతో సాగు, విద్యుత్ సరఫరా వంటి మంచి పథకాలను అమలు చేసి, అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్న రాష్ట్రంలో అశాంతికి తావు లేదని, శాంతిని భంగం చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజలు మమ్మల్ని ఆదరించిన నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా శాంతి, అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పని చేస్తామని, నకిలీ పోరాటాల వెనక దాగి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు వృథా అవుతాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆ పార్టీ నాయకులకు కూడా తన వ్యవహార శైలిని మార్చుకోకుండా తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరిని వదలం, కేసులు పెడతామంటూ బెదిరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని వారికి ఓట్లు వేసే పరిస్థితి ఉండకపోగా రోడ్ల పైన కూడా తిరగనివ్వరని హెచ్చరించారు.
రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా అడుగులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లు అహర్నిశలు ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడులను తీసుకువస్తున్నారని కొనియాడారు. సింగపూర్ పర్యటన వలన కూడా రాష్ట్రానికి 45 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి రానున్నాయని ఇలాంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగిందా అని జగన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం, పల్లె ప్రగతి, పారిశ్రామిక వికాసమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. పేదలకు అండగా, యువతకు అవకాశాలుగా, రైతులకు మద్దతుగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రతి నిర్ణయం, ప్రతి ఆర్థిక కేటాయింపు కూడా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదం చేసేలా తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమిష్టిగా ఒకే దిశగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడమే కాకుండా, మరిన్ని ప్రజల కొరకు కొత్త పథకాలు రూపొందిస్తూ అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. రాష్ట్రంలో మహిళలు, యువతీ యువకులు, వ్యాపారవేత్తలు అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అయితే జగన్మోహన్ రెడ్డి తన ఉనికి కోసం పరామర్శల పేరుతో తిరుగుతూ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.