28-07-2025
నిమ్మాడ
వ్యవసాయానికి ‘ప్రభుత్వ డ్రోన్’ సాయం
80 శాతం సబ్సిడీతో రైతు బృందాలకు డ్రోన్స్ ను అందిస్తున్న కూటమి ప్రభుత్వం
సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకోవాలని
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
నిమ్మాడ, జూలై 28: ఆరుగాలం శ్రమించే రైతులకు వ్యవసాయాన్ని సులభతరం చేయాలని దేశంలోనే తొలిసారిగా కూటమి ప్రభుత్వం 80 శాతం రాయితీపై రైతులకు డ్రోన్లు అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో సోమవారం వ్యవసాయానికి ఉపయోగించే డ్రోన్ ను ప్రారంభించి, డ్రోన్ పనితీరును పరిశీలించి, నందిగాం మండలం నరేంద్రపురం రైతులకు డ్రోన్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ సాగుకు సాంకేతికతను జోడిస్తే కూలీ ఖర్చులు, సమయం ఆదా అవుతుందని అన్నారు. ఒక ఎకరంలో పురుగుమందు పిచికారీ చేయడానికి డ్రోన్ కు ఏడు నిమిషాలు సమయం తీసుకుంటుందని చెప్పారు. అదే రైతు భుజాన వేసుకుని స్ప్రే చేయాలంటే రెండు గంటల సమయం తీసుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్క రైతు కాలానుగుణంగా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. డ్రోన్ వాడకంతో సాగు ఖర్చు తగ్గి పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. పంటల పెరుగుదల , తెగుళ్ల నియంత్రణను పర్యవేక్షించడంతోపాటు దిగుబడి పెంచడానికి డ్రోన్ లు సహాయపడతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా బ్రౌచర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు త్రినాథ స్వామి, జగన్మోహనరావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు