తిరుమలలో నూతన శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం ప్రారంభం
తిరుమల, జూలై 22:
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేసేందుకు తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా నూతన శ్రీవాణి దర్శన టికెట్ల కేంద్రాన్ని మంగళవారం టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు టీటీడీ ఈవో జె.శ్యామలరావు,అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచే క్యూలైన్లలో నిలబడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో భక్తులకు సులభతరంగా టికెట్లు జారీ చేసేందుకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో రూ.60 లక్షల వ్యయంతో ఈ నూతన కౌంటర్లను నిర్మించినట్లు తెలిపారు.
రేపటి నుంచే ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టికెట్ల పంపిణీ ప్రారంభం అవుతుందని, భక్తులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర ఎల్లా, జంగా కృష్ణమూర్తి, భాను ప్రకాష్ రెడ్డి,శాంతా రామ్, నరేష్,సదాశివరావు, నర్సిరెడ్డి, శ్రీమతి జానకి దేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.