పూర్వ విప్లవ విద్యార్థి వేదిక రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి
ఈ నెల 22న గుంటూరు లో ఐదు దశాబ్దాల ఉద్యమ ప్రస్థాన రాష్ట్ర సదస్సు నిత్వహిస్తున్నట్టు పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ఏపీ కన్వీనర్ ఆర్. భరద్వాజ్ తెలిపారు.
విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు విప్లవ విద్యార్థి ఉద్యమ చరిత్ర విప్లవోద్యమనిర్మాణం లో విప్లవ విద్యార్థులు నిర్వహించిన చారిత్రాత్మక పాత్ర గుర్తుచేసుకున్నారు.
1974 లో ఆవిర్భవించిన రాడికల్ విద్యార్థి సంఘం కళాశాలలలో విద్యార్థినులపై జరుగుతూన్న వేధింపులను ఎదిరించి నిలిచిన ఘటనలను విరసం అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ గుర్తు చేశారు. అలాగే కులం పేరుతో మతం పేరుతో దళిత మైనారిటీ విద్యార్థులపై జరిగిన అణచివేతను ప్రతిఘటించి వారిలో ఆత్మ విశ్వాసం కలిగించిన చరిత్ర రాడికల్ విద్యార్థి సంఘానికి ఉన్నది అని వివరించారు అరసవిల్లి కృష్ణ.
విద్యార్థులు గ్రామాలకు తరలాలి అనే కార్యక్రమం చేబట్టిన ఘనత రాడికల్ విద్యార్థి సంఘందే అన్నారు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు న్యాయవాది నున్న అరవింద్.
గ్రామాల్లో ఆర్ధిక సంబంధాలు పేద దళిత బడుగు జీవులను భూస్వామ్యం అణచివేస్తున్న తీరును అధ్యయనం చేసి ప్రపంచం ముందు ఉంచడంలో రాడికల్ విద్యార్థుల పాత్ర గుర్తుంచుకోవలసి ఉన్నది అన్నారు.
విద్యార్థి ఉద్యమం నుంచీ దోపిడీ అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం విప్లవోద్యమ బాట పట్టిన విద్యార్ధులను ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం హత్యలు చేయడం ఖండించితీరాల్సిన విషయంగా సమావేశంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు.
కేంద్ర బలగాలు ఇటీవల అబూజ్ మాడ్ అటవీ ప్రాంతం లో హత్య చేసిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు తో పాటు బిజాపూర్ అడవి ప్రాంతం లో హత్యకు గురైన తెంటు లక్ష్మి వెంకట నరసింహా చలం ల స్మృతి లో గుంటూరు సదస్సు నిర్వహిస్తున్నామని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక నాయకులు భరద్వాజ్ తెలిపారు.
వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొనే సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.