విజయవాడ,
17-05-2025.
మహిళల రక్షణ, మహిళా సాధికారతే జాతీయ మహిళా కమిషన్ లక్ష్యం
• మహిళలపై దాడులకు పాల్పడితే శిక్ష తప్పదు
• మహిళా కమిషన్ 24 గంటలు వారికి అందుబాటులో ఉంటుంది
• పది మంది సిబ్బంది దాటిన ప్రతి సంస్థలోనూ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేయాలి
• బాలికల రక్షణ కోసం చర్యలు తీసుకుంటాము.
- శ్రీమతి. డాక్టర్ అర్చన మంజుందార్, జాతీయ మహిళా కమిషన్ మెంబర్.
బాలికలు, మహిళల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కు మహిళా కమిషన్ కృషి చేస్తుందని జాతీయ మహిళా కమిషన్ మెంబర్ శ్రీమతి. డాక్టర్. అర్చన మజుందార్ అన్నారు. దేశంలో ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ మహిళా కమిషన్ మూడు రోజుల రాష్ట్ర పర్యటన లో భాగంగా మొదటి రోజు మంగళవారం విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పాత ప్రభుత్వ వైద్యశాలను జాతీయ మహిళా కమిషన్ మెంబర్ డాక్టర్. అర్చన మజుందార్ సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ అర్చన మజుందార్ మాట్లాడుతూ బాలికలు, మహిళలపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేసినా, దాడులు చేసినా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది పనిచేస్తున్న ఏ వ్యాపార సంస్థలైనా, విద్యాసంస్థలైనా, కార్యాలయాలైనా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆ కమిటీని సీనియర్ మహిళా ఉద్యోగిని ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల రక్షణ కోసం 24 గంటలు మహిళా కమిషన్ అందుబాటులో ఉంటుందని, బాధితులు ఏ సమయమైనా తమకు ఫిర్యాదు చేయవచ్చని, తక్షణం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలికలు, మహిళల రక్షణ కోసం, వారి సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఐసీసీ(ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ) ఏర్పాటు చేశారా లేదా అని జాతీయ మహిళా కమిషన్ మెంబర్ అర్చన మజుందార్ వాకబు చేశారు. వారం రోజుల్లో ఐసీసీ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కళాశాలలో మహిళ రక్షణ చర్యలపై డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని, హెల్ప్ లైన్ నెంబర్ లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు, కళాశాల ఉద్యోగులు, ప్యాకల్టీల సమస్యలను మొదట ఐసీసీ కమిటీ లో పరిష్కరమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ మాట్లాడుతూ ఆయా సంస్థల్లో ఏర్పాటు చేసిన ఐసీసీ ద్వారా బాధిత మహిళకు న్యాయం జరగపోతే రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతి మహిళా ప్రశాంత వాతావరణంలో పనిచేసేలా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందని వివరించారు. వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులతో పాటు ఏ రకంగానైనా మహిళలను వేధిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏ. ఏడుకొండల రావు, ఐసీడీఎస్ అధికారులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.