ఎన్టీఆర్ జిల్లా, జూన్ 16, 2025 యోగాసనాలపట్ల యువతలో చైతన్యం రావాలి యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం యోగాభ్యసనకు రోజూ కొంత సమయాన్ని కేటాయించాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ యువత నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నిరంతర యోగా ఎంతో దోహదపడుతుందని, శారీరక, మానసిక ఉల్లాసానికి యోగాసనాలు ఏకైక మార్గమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని జిల్లా రెడ్క్రాస్, యూత్ రెడ్క్రాస్ సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జీవితంలో యోగాను భాగం చేసుకునేలా అన్ని వర్గాల ప్రజలను ప్రోత్సహించేందుకు యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా యువత నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు మానసిక ప్రశాంతత, పరిపూర్ణమైన ఆరోగ్యం ఎంతో అవసరమన్నారు. యోగాసనాల ద్వారానే ఇది సాధ్యపడుతుందన్న విషయాన్ని గుర్తెరిగి, ప్రతిరోజూ కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూచించారు. ఒక్కో యోగాసనంలో శరీరంలోని ఒక్కో భాగాన్ని క్రియాశీలం చేసేంత శక్తి దాగిఉందన్నారు. వాటిని ఆచరించడం ద్వారా యోగాలో మాధుర్యాన్ని తెలుసుకోగలుగుతారన్నారు. ప్రజల జీవితంలో యోగాను భాగం చేయడం ద్వారా ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశమన్నారు. బీపీ, మధుమేహం, కుంగుబాటు వంటి జీవనశైలి సమస్యలు దరిచేరకుండా యోగాసనాలు సహాయపడతాయన్నారు. మానవతావాదంతో అనునిత్యం శ్రమించే రెడ్క్రాస్ సభ్యులు, వాలంటీర్లతో కలిసి యోగాసనాలను అభ్యసించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.జిల్లా రెడ్క్రాస్ ఛైర్మన్ డా. జి.సమరం మాట్లాడుతూ రెడ్క్రాస్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. మనిషికి మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగాను నేర్పించడం కూడా ఓ గొప్ప సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రభుత్వ చొరవను సద్వినియోగం చేసుకొని ప్రజలు తమ జీవితంలో యోగాను తప్పనిసరిగా భాగం చేసుకొని ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా రెడ్క్రాస్ సంస్థ వైస్ ఛైర్మన్ డా. వెలగా జోషి, ఎన్సీసీ జిల్లా సమన్వయకర్త డా. కె.రమేష్, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, యోగా ట్రైనర్ సత్యనారాయణ, యుగంధర్, రెడ్క్రాస్, యూత్ రెడ్క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.