అవినీతిని సహించేది లేదు… రుజువైతే చర్యలు తప్పవు
ఆరోపణలు వస్తే తక్షణ విచారణ… ‘జీరో కరెప్షన్ ఏపీ’ లక్ష్యం
10 ముఖ్యమైన ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరించండి
ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, జూన్ 14 : ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని… జీరో కరెప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని… అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి… వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన అభిప్రాయాలపై శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్టు ఐవీఆర్ఎస్, సీఎస్డీఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైందని… అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని… సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమం, ఉద్యోగాలకల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి…వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్, పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియజేయాలన్నారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు, ఆగస్ట్ 15 కల్లా అన్ని సేవలను వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర కింద అందించాలని స్పష్టం చేశారు. మరోవైపు…వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకువెళ్లి అందించండ మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచన చేయాలన్నారు. చౌకధరల దుకాణాలను పెంచడం, నగదు… లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అలాగే ఉచిత ఇసుక విధానం అమలులో…ఇసుక లేని చోట్ల సంతృప్తి, ఇసుక ఉన్న చోట అసంతృప్తి ఉండటంపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ప్రజాభిప్రాయం ఇలా :
• పింఛన్ల పింపిణీ : అవినీతి లేదని 85 శాతం మంది, ఇంటిదగ్గరే ఇస్తున్నారని 87.8 శాతం, ఉద్యోగుల ప్రవర్తన బావుందని 83.9 శాతం మంది ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎస్డీఎస్ ఫీల్డ్ సర్వేలో లబ్ధిదారులను నేరుగా కలిసి ప్రశ్నించగా…పింఛన్ల పింపిణీలో అవినీతి లేదని 93.9 శాతం మంది, ఇంటిదగ్గరే ఇస్తున్నారని 93.3 శాతం, ఉద్యోగుల ప్రవర్తన బావుందని 73.3 శాతం మంది-పర్వాలేదు అని 23.1 శాతం మంది చెప్పారు.
• అన్న క్యాంటీన్లు : పరిశుభ్రంగా ఉన్నాయని 80.5 శాతం, ఆహారం నాణ్యత బావుందని 79.3 శాతం, సమయపాలన పాటిస్తున్నారని 80.8 శాతం మంది ఐవీఆర్ఎస్ ద్వారా చెప్పారు.
• ఆస్పత్రి సేవలు : క్వాలిటీ చెకప్పై 68.4 శాతం, రక్త పరీక్షలపై 55 శాతం, ఉచిత మందుల పంపిణీపై 65.5 శాతం, సిబ్బంది ప్రవర్తనపై 71.3 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.
• మున్సిపల్ సేవలు : రోజూ చెత్త సేకరణపై 68.1 శాతం, 24 గంటల్లో చెత్త డంప్ తరలింపుపై 57 శాతం సంతృప్తి చెందారు.
• ఆలయాలు : సౌకర్యాలకు సంబంధించి 68 శాతం దర్శనం బావుందని, 63.6 శాతం సౌకర్యాలు బావున్నాయని, 77.7 శాతం ప్రసాదం నాణ్యత బావున్నాయని భక్తులు చెప్పారు.
• ఏపీఎస్ఆర్టీసీ : శుభ్రత, సీటింగ్ విషయంలో 53.4 శాతం, నీటి సౌకర్యం 45.2 శాతం, టాయిలెట్స్పై 56 శాతం, బస్సు సమయం-రూట్ వివరాలపై 61.5 శాతం, 69 శాతం మంది బస్సులు సమయానికి బయల్దేరుతున్నాయని, 69.7 శాతం సమయానికి చేరుకుంటున్నామని, 72.4 శాతం సిబ్బంది ప్రవర్తన బావుందని, 69.7 శాతం రక్షణ కలిగి ఉన్నాయని చెప్పారు.
• దీపం-2 : ఎక్కువ డబ్బు వసూళ్లు చేయడం లేదని 62.8 శాతం చెప్పారు.
• రేషన్ : నెలనెలా రేషన్ సరుకులు తీసుకుంటున్నామని 75.1 శాతం, నాణ్యత బావుందని 73.8 శాతం చెప్పారు.
• ఎరువులు : లభ్యత ఉందని 60.9 శాతం మంది రైతులు చెప్పారు.
• విత్తనాలు : సమయానికి విత్తనాల సరఫరా జరిగిందని 63 శాతం చెప్పారు.
• గంజా, డ్రగ్స్ : తమ ప్రాంతంలో డ్రగ్స్ సంబంధిత సమస్య ఉందని 27.4 శాతం, పోలీసులు స్పందిస్తున్నారని 54.5 శాతం మంది చెప్పారు.
• మహిళలపై హింస : పబ్లిక్ ప్రాంతాల్లో వేధింపులు ఉన్నాయని 27.8 శాతం, పోలీసుల స్పందన బావుందని 59.5 శాతం, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని 56.3 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
• రిజిస్ట్రేషన్ సేవలు : స్లాట్ బుకింగ్ ప్రాసెస్పై 63.4 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, అవినీతి లేదని 62.3 శాతం మంది చెప్పారు.
• ఇసుక : రిజిస్ట్రేషన్ ప్రాసెస్పై 70.6 శాతం, లభ్యతపై 67.5 శాతం, ధర పైన 61.1 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.
• రెవెన్యూ సేవలు : ఎఫ్ లైన్పై ఎక్కువ డబ్బులు వసూళ్లు చేయడం లేదని 77.4 శాతం, పాస్బుక్ సర్వేలో ఎక్కువ మొత్తం తీసుకోలేదని 75.1 శాతం చెప్పారు.
• ఎలక్ట్రిసిటీ : నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోందని 61.6 శాతం చెప్పారు.
• పంచాయతీ సేవలు : ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతోందని 56.7 శాతం చెప్పారు.
• ఎన్టీఆర్ వైద్య సేవ : అడ్మిషన్లపై 86.2 శాతం, సేవలపై 81.3 శాతం, ఆరోగ్య మిత్ర సాయంపై 82.4 శాతం మంది సంతృప్తి వ్యక్త చేయగా… అవినీతి లేదని 78.5 శాతం అన్నారు.