ఆన్లైన్ శిక్షణా తరగతులతో జర్నలిజం కోర్సులు సి ఆర్ ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటికి నిమ్మరాజు వినతి విజయవాడ జూన్ 13:భవిష్యత్తు జీవనోపాధి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ శిక్షణా తరగతులతో జర్నలిస్టులకు జర్నలిజం సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించాలని సిఆర్ ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ను శుక్రవారం కలిసిన సీనియర్ జర్నలిస్టు, ఉమ్మడి రాష్ట్ర అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు. నాలుగు దశాబ్దాల క్రితం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లాల్లో శిక్షణ తరగతులు నిర్వహించామని ఆపై తొలి చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి సహకారంతో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించడం ప్రారంభించామని నిమ్మరాజు తెలిపారు. ఈ తరగతులలో అందించిన సర్టిఫికెట్ల వలన ఆశించినంత ప్రయోజనం కన్పించలేదన్నారు. సెల్ఫోన్ వ్యవస్థ వలన ఏ ఒక్కరు ప్రసంగాలపట్ల దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని అన్నారు. అసెంబ్లీ తరహాలో తరగతి గది వెలుపల సెల్ఫోన్లను సేకరించడం మంచిదన్నారు. 30 ఏళ్ల క్రితం గుంటూరులో సురేష్, తను కలిసి పనిచేసిన స్మృతులను నిమ్మరాజు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.