రోగులకు సీఎం సహాయనిధి వరం : యార్లగడ్డ గన్నవరం : రోగుల పాలిట ముఖ్యమంత్రి సహాయనిధి వరంగా మారి వారిని ఆర్థికంగా ఆదుకుంటుందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గం లోని పలువురు రోగులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన ఎల్ఓసిలు, చెక్కులను రోగుల కుటుంబ సభ్యులకు యార్లగడ్డ అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బాపులపాడు మండలం వేలేరు గ్రామానికి చెందిన షేక్ నబియాకు రూ.2 లక్షలు, ఇదే మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన కట్టుబోయిన రమాదేవికి లక్ష రూపాయలు, విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామవాసి కొంపల్లి త్రిశాంఖ్ కు రూ. 2 లక్షల చెక్కును యార్లగడ్డ అందించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోగులకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఉదారంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పేద రోగులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం ఆరోగ్య భీమాను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో అత్యధికంగా సి.ఎమ్. ఆర్.ఎఫ్ నిధులు తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా రోగుల కుటుంబ సభ్యులు యార్లగడ్డ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గూడపాటి తులసి మోహన్, ఆవిర్నెని భవాని శంకర్, కాజ సురేష్ తదితరులు పాల్గొన్నారు.