చల్లంగా చూడమ్మా గంగమ్మ తల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్న సీఎం
కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగ జాతరలో పాల్గొని, పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు
కుప్పం, మే 21 : చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయం పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జాతర కావడంతో దంపతులు ఇరువురు టీటీడీ తరపున గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు తీర్ధప్రసాదాలు అందించారు. ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని చేసుకుని, రాష్ట్రాన్ని గంగమ్మ చల్లంగా చూడాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురు నాయకులు జాతరలో పాల్గొన్నారు. గంగమ్మ దర్శనానికి ముందుగా కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు జిల్లా అధికారులు, స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గంగమ్మ దర్శనం అనంతరం సీఎం అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు.