అవినీతినేతలను ప్రజలు ప్రశ్నించాలి
సుజనా చౌదరి
వైసీపీ పాలనలో భావవ్యక్తీకరణకు స్వేచ్ఛ లేదని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. న్యాయవాదుల ఉచిత న్యాయ సహాయ కేంద్రం అవగాహన సదస్సును సితార వద్ద గల కన్వెన్షన్ సెంటర్ లో శనివారం నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది గోగుశెట్టి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ వైసిపి పాలనలో భావవ్యక్తీకరణకు స్వేచ్ఛ లేదని అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతల మీద అక్రమ కేసులు బనాయిస్తూ వారి హక్కులను కాల రాస్తున్నారన్నారు ప్రజాస్వామ్యం వికసించాలంటే అవినీతిపరులైన రాజకీయ నేతలను ప్రజాప్రతినిధులను ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. ఐదేళ్ల అవినీతి పాలన వల్ల అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఎంతో గర్వించదగ్గ తెలుగుజాతి అభివృద్ధిలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికీ లేదని స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ జీవించే హక్కు ఉందన్నారు. అవినీతి అరాచకాలతో పరిపాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని. రానున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విపిన్ నాయర్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ పి బి సురేష్ సుప్రీంకోర్టు న్యాయవాది సుగోష్ సుబ్రహ్మణ్యం నూకల నాగేశ్వరరావు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.