ఎన్టీఆర్ జిల్లా, మే 09, 2024
ప్రజాస్వామ్య పరిరక్షణ ధీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు
ఓటర్లకు స్ఫూర్తిగా నిలిచిన 99 ఏళ్ల అడుసుమిల్లి
వేణుగోపాలరావు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్న సంకల్పానికి అడుసుమిల్లి నిదర్శనం
ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటిచెప్పిన ధీరుడు.. స్వాతంత్ర్య సమరయోధుడు, 99 ఏళ్ల కురువృద్ధుడు అడుసుమిల్లి వేణుగోపాలరావు హోం ఓటింగ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో సత్యనారాయణపురానికి చెందిన 99 ఏళ్ల వృద్ధుడు అడుసుమిల్లి వేణుగోపాలరావు, ఆయన సతీమణి 90 ఏళ్ల అడుసుమిల్లి హనుమారత్నం ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ బయటకు రాలేని పరిస్థితి. భారత ఎన్నికల సంఘం 85 సంవత్సరాలు పైబడిన వృద్దులకు ఇంటివద్దనే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించిందనే విషయాన్ని తెలుసుకొని ఆనందంతో జిల్లా ఎన్నికల అధికారికి స్థానిక రిటర్నింగ్ అధికారి ద్వారా హోం ఓటింగ్ కోసం వారు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ సీనియర్ సిటిజన్ దంపతులకు 85 ఏళ్లు పైబడినందున వారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంటివద్దే ఓటు వేసేందుకు (హోం ఓటింగ్)కు వీలుకల్పించిందని.. దీంతో ఈ దంపతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ నెల 9వ తేదీన తమ ఇంటి వద్దే పోలింగ్ అధికారి, సహాయ పోలింగ్ అధికారి సహకారంతో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఈ వృద్ధ దంపతులను స్ఫూర్తిగా తీసుకొని ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించి.. ఈ నెల 13న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ డిల్లీరావు పిలుపునిచ్చారు.