ఎన్టీఆర్ జిల్లా, మే 25, 2024
చిన్నారుల్లో మానసిక ఉల్లాసం, మేధో వికాసానికి వేసవి శిక్షణ శిబిరాలు ఎంతో దోహదపడతాయని, స్వచ్ఛందంగా చిన్నారులకు వ్యాయామం, నృత్యం వంటివి నేర్పించడంతో పాటు ప్రతిభను పెంచేలా వివిధ అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు
స్థానిక న్యూ ఆర్టీసీ కాలనీ మదర్ థెరిస్సా మునిసిపల్ పార్కులో లయన్స్ క్లబ్ ఆఫ్ పేరాల అంకినీడు ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు ముఖ్య అతిథిగా హాజరై వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ చిన్నారులకు ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించడంతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల వంటి జీవన నైపుణ్యాలను పెంపొందించేందుకు వేసవి శిక్షణ శిబిరాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. వేసవి సెలవులు విద్యార్థులకు ఆటవిడుపు అయినప్పటికీ రోజులో కొంత సమయాన్ని వారికి నచ్చిన అంశాల్లో శిక్షణ పొందగలిగితే భవిష్యత్తులో మరింత రాణించేందుకు అవకాశాలు ఉంటాయన్నారు
లయన్స్ క్లబ్ ఆఫ్ పేరాల అంకినీడు ఆధ్వర్యంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా చిన్నారులకు స్వచ్ఛందంగా నెల రోజుల పాటు వ్యాయామం, క్రీడలు, పెయింటింగ్, నృత్యం, ధ్యానం, గీతాలాపన వంటి అంశాల్లో నైపుణ్యంగల శిక్షకులతో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. శిక్షణ ముగించుకున్న చిన్నారులకు కథల పుస్తకాలను ఉచితంగా అందజేయడం, నేర్చుకున్న అంశాల్లో పోటీలు నిర్వహించి చిన్నారులకు ప్రశంసాపత్రాలు, బహుమతులను అందించడం ద్వారా వారిని మరింత ప్రోత్సహించినట్లవుతుందన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కాలనీల అసోసియేషన్లు ముందుకొచ్చి మరిన్ని శిబిరాలను నిర్వహించి చిన్నారులను అన్ని రంగాల్లో పురోగతి సాధించేలా కృషిచేయాలని కోరారు.*
ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వాహకులు టి.సరోజ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు విద్య, విజ్ఞానం, శారీరక, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను నిర్లక్ష్యంగా చేయకుండా ఉండేలా సెలవులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు కొంత సమయాన్ని శిక్షణ శిబిరంలో గడిపి నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో నెల రోజుల పాటు శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. శిబిరంలో దాదాపు 75 మంది పిల్లలకు పలు అంశాల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. దీంతోపాటు చిన్నారులకు దంతవైద్య చికిత్స శిబిరం నిర్వహించి దంత సమస్యలను గుర్తించడంతో పాటు ఉచితంగా పేస్టు, బ్రష్లు, మందులను అందించడం జరిగిందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో శిబిరం సమన్వయకర్త డి.శ్రీనివాసన్, గ్రూప్ కంట్రోలర్ జి.సాయి తేజస్వి, యోగా టీచర్ పి.కమల, డ్యాన్స్ టీచర్ ఎ.శోభ, డ్రాయింగ్ టీచర్ ఎస్.రమ్య, స్టోరీ టీచర్లు ఎల్.శ్రీలత, బి.చంద్రకళ, దంత వైద్య నిపుణులు డా. అట్లూరి నాగేంద్రకుమార్, శిక్షణ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.