పవన్‌ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం ఇరిగేషన్‌ అతిధి గృహం గన్నవరం ఎయిర్‌పోర్టులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఘన స్వాగతం

Spread the love

 పవన్‌ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం ఇరిగేషన్‌ అతిధి గృహం

 గన్నవరం ఎయిర్‌పోర్టులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఘన స్వాగతం

అమరావతి: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయల్దేరారు. పవన్‌ కళ్యాణ్  మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి వెళ్తున్నారు. రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. మంత్రిగా బుధవారం ఆయ‌న తన ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకోనున్నారు. స‌చివాల‌యంలో త‌న ఛాంబ‌ర్‌ను ప‌రిశీలించిన అనంత‌రం సీఎం చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని స‌మాచారం.ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సోమ‌వారం ఛాంబ‌ర్ కేటాయించారు. రెండో బ్లాక్‌లోని మొద‌టి అంత‌స్తులో 212 గ‌దిని కేటాయించ‌డం జ‌రిగింది. ఇక చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించిన విష‌యం విదిత‌మే.

డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీసుకు విశాల ప్రాంగణం

ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ క్యాంప్‌ కార్యాలయంగా ఇరిగేషన్‌ గెస్ట్‌హౌస్  ను ప్రభుత్వం కేటాయించింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్‌ గెస్ట్‌హౌ్‌సను గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు విశాలంగా నిర్మించారు. తర్వాత గత ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ అతిధి గృహాన్ని కేటాయించారు. అలాగే, సచివాలయంలో గతంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పేషీ ఐదో బ్లాక్‌లో ఉండేది. ఇప్పుడు పవన్‌తో పాటు జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్ కు కూడా రెండో బ్లాక్‌లో మొదటి అంతస్తులో కేటాయించారు. ఇప్పటికే ఈ బ్లాక్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లో పేషీని మంత్రి నారాయణకు అప్పగించారు. సీఎం పేషీ ఒకటో బ్లాక్‌ వద్ద ఉండటంతో, పవన్‌ పేషీలు రెండోబ్లాక్‌లో ఉంటే అందుబాటులో ఉంటుందని ఆ మేరకు కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *