అమరావతి/బాపట్ల
మత్స్యకారులను చూసి ఆగిన హోంమంత్రి అనిత- అక్కడిక్కడే బాపట్ల ఎస్పీకి ఫోన్
వైఎస్సార్సీపీ పాలనలో తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ బాపట్ల జిల్లా మత్స్యకారులు హోంమంత్రి వంగలపూడి అనితకు వినతిపత్రం సమర్పించారు. చీరాల వెళ్తున్న హోంమంత్రి బాపట్ల జిల్లా మత్స్యకారులు చేతిలో వినతిపత్రం చూసి కాన్వాయ్ ఆపి వారిని కలిశారు. వైసీపీ పాలనలో తమను కొట్టి జైళ్లు, కోర్టుల వెంబడి తిప్పారంటూ అనిత వద్ద మత్స్యకారులు కన్నీటి పర్యంతమయ్యారు. వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను గ్రామ సమస్యగా మార్చి గ్రామస్థులపై అక్రమ కేసులు పెట్టారని అనితకి ఫిర్యాదు చేశారు.
ఇప్పటికి కేసుల పేరుతో కోర్టుల చూట్టూ తిరుగుతున్నామని వాపోయారు. ఎటువంటి తప్పు చేయకపోయిన అక్రమంగా కేసులు పెట్టి ఆర్థికంగా, మానసికంగా హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదుపై బాపట్ల జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన హోం మంత్రి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే అక్రమ కేసులపై వివరణ ఇవ్వాలని కోరారు.