27.06.2024*
వ్యాపార రంగంలోనూ ప్రజాహితం చూసిన ఏకైక వ్యక్తి రామోజీరావు*సీఎం చంద్రబాబు పేర్కొన్నారు
విలువలతో పత్రికను నడిపిన అక్షర యోధుడు
వేధింపులకు రాజీపడని మీడియా శిఖరం రామోజీ
తెలుగుజాతి వెలుగు, స్ఫూర్తి రామోజీకి భారతరత్న ఇవ్వాలి
వేధింపులకు, బెదిరింపులకు భయపడకుండా మీడియాను నడిపారు
అమరావతిలో ఒక రహదారికి రామోజీ మార్గం అని, విశాఖలో చిత్రనగరికి రామోజీ పేరు పెడతాం
రామోజీరావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళం అందించిన రామోజీ కుటుంబ సభ్యులు
కానూరు/అమరావతి వ్యాపార రంగంలోనూ ప్రజాహితాన్ని చూసిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. సమాజం కోసం ఆలోచించి వ్యాపార, సినీ, సేవా, పత్రికారంగంలో రామోజీరావు తనకుతానే సాటిగా నిలిచారన్నారు. విలువలతో పత్రికను నడిపిన అక్షర యోధులు రామోజీరావు అని అన్నారు. కానురులోని అనుమోలు గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు గురువారం హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రామోజీరావు ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…‘‘ఈ సమాజానికి ఎంతో మేలు చేసిన రామోజీరావుకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పగలుగుతామనడానికి నివాళులర్పించడమే మార్గం. ఆయనలోని స్ఫూర్తిని మనమంతా గుర్తుపెట్టుకుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. సాధారణ కుటుంబంలో పుట్టి అచెంచలమైన వ్యక్తిగా ఏ విధంగా ఎదుగుతారనడానికి రామోజీ ఒక ఉదాహరణ. ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటారు…ఒకే ఒక రామోజీరావు ఉంటారు. ఆ ఇద్దరినీ జీవితంలో ఎవరూ అధికమించలేరు. రామోజీ అసాధారాణ శక్తి…వ్యక్తి కాదు..ఒక వ్యవస్థ. రామోజీరావు వ్యవస్థలను నిర్మించారు. ఆయన ఏ రంగాన్ని తీసుకున్నా నెంబర్-1గా నిలబెట్టారు. ఏం చేపట్టినా ఉన్నతస్థాయిలో ఆలోచించారు. పద్ధతి ప్రకారం నిజాయితీగా పని చేశారు. ప్రజాస్వామ్యం కోసం యోధునిలా పోరాటం చేశారు. మీడియా రంగంలో చేసిన కృషికి అనేక అవార్డులు వచ్చాయి. కేంద్రం కూడా పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. రామోజీ సమాజానికి చేసిన సేవకు ఆ అవార్డులు వచ్చాయి.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
విశ్వసనీయతకు మారుపేరు రామోజీ
‘‘1962లో మార్గదర్శి చిట్ ఫండ్ స్థాపించారు. అంతకముందు…తర్వాత అనేక చిట్ ఫండ్ సంస్థలు వచ్చాయి…కానీ మార్గదర్శి నేటికీ మార్గదర్శిగానే ఉంది. గత ప్రభుత్వాలు మార్గదర్శిపై ఎన్ని కుట్రలు చేసినా ఆ సంస్థపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టలేకపోయారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మార్గదర్శిలో పెట్టుబడి పెట్టిన వారు ఆయనతో ఉన్నారంటే అది రామోజీ పట్ల ఉన్న వివ్వాసం, విశ్వసనీయత. 1969లో అన్నదాత మ్యాగ్ జైన్ తెచ్చి రైతులకు ఎనలేసి సేవలు చేశారు. 1974 ఆగస్టు 10న ఈనాడు దినపత్రికను విశాఖలో స్థాపించారు. 5 దశాబ్దాలుగా ఈనాడు పత్రిక ప్రజాచైతన్యం కోసం పని చేస్తోంది. 22 జిల్లా ఎడిషన్లు ప్రవేశపెట్టి వినూత్నమైన ఆలోచనతో ప్రజాసమస్యలను ఎండగట్టారు. రాజకీయాల్లో ఉన్న మేము ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తాం…అధికారంలో ఉంటే సమస్యలు పరిష్కారం చేస్తాం. కానీ రామోజీ పత్రికా రంగంలో ఉండి ప్రజాసమస్యలుపై నిరంతరం పోరాడారు. 40 ఏళ్లుగా ఈనాడు నెంబర్-1గా ఉందంటే దాని వెనక రామోజీ కార్యదీక్షత, కృషి ఉన్నాయి. కొన్ని వందల మంది జర్నలిస్టులును, నటీనటులను, గాయకులను, కళాకారులను తయారు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఒకేసారి 7 ఛానెల్స్ పెట్టి జయప్రదం చేశారు.’’ అని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
సేవాభావంతో ముందుకెళ్లారు
‘‘హైదరాబాద్ వెళ్లిన ఎవరైనా రామోజీ ఫిల్మ్ సిటీ చూడకుండా తిరిగొచ్చే పరిస్థితి లేదంటే అందులో ఆయన పడ్డ కష్టం ఉంది. విపత్తులు వచ్చినప్పుడు సేవాభావంతో రామోజీ ముందుకెళ్లారు. తుఫాన్లు వస్తే మన తెలుగురాష్ట్రాలైనా, ఇతర రాష్ట్రాలైనా సేవలందించారు. పెదపారుపూడి, తెలంగాణలోని నాగన్ పల్లి గ్రామాలను దత్తత తీసుకుని రూ.25 కోట్లతో అభివృద్ధి చేశారు. కోవిడ్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు సేవలందించారు. 40 ఏళ్లుగా నేను రామోజీని దగ్గరుండి చూశాను…ఆయనలో భయం లేదు. పోరాటం ఆయన జీవితంలో భాగం. ఏ విషయంలోనైనా రాజీలేకుండా పోరాటం చేశారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ నెంబర్-1గా ఎలా ఉంటారో…తెలుగువారికి సేవలందించిన వ్యక్తిగా రామోజీని కూడా తెలుగు జాతి శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటుంది.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
విలువల కోసం రామోజీ బతికారు
ఈ రోజుల్లో రేటింగ్ లు కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వద్దకెళ్లి పనులు చేసుకుంటున్నారు. నాకు ఒక పని చెయ్యి, చెప్పిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వు, మంత్రి పదవి ఇవ్వు అని అడగలేదంటే అదీ రామోజీ నీతినిజాయితీ. ప్రజాస్వామ్యం అపహాస్యం అయినప్పుడు తన వంతుగా వచ్చి పోరాడారు. చాలా మంది పదువులుంటేనే సేవ చేస్తామనుంకుంటారు..కానీ రామోజీ తనకు కావాల్సింది పదవులు కాదు ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన సేవలందిస్తానని నిరూపించారు. 1982 వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదు…ప్రత్నామ్నాయం కోసం ఆలోచించి పార్టీ పెట్టిన 9 నెలల్లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారంటే అందులో ప్రముఖ పాత్ర రామోజీరావుది ఉంది. ఆగస్టు సంక్షోభం వస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాజీలేని పోరాటం చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంటుంది. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా రంగం ప్రజాస్వామ్యానికి పిల్లర్ లాగా ఉంటుంది. ఈనాడు పత్రికలో వార్తకు ఒకసారి ఉల్లంఘన కింద నోటీసులు ఇస్తే సుప్రీంకోర్టులో కూడా పోరాడి నిలబడ్డారు.’’ అని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
రామోజీ సూచనతోనే రాజధానికి అమరావతి పేరు
‘‘మార్గదర్శిపైనా అనేక కేసులు పెట్టారు…ఆయన్ను రకరకాలుగా హింసించారు. నేను ప్రజల కోసం పోరాడుతున్నా…సంపాదించిన ఆస్తులన్నీ పోయినా పర్వాలేదని రాజీపడకుండా పోరాడారు. 86 ఏళ్ల వయుసులో బెడ్ పై ఉన్నా ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్నారు. నేను ఆయన్ను చూసి నేర్చుకునేది ఒకటే…వినూత్నంగా సైబరాబాద్ నిర్మించి అభివృద్ధి చేశాను. హైదరాబాద్ అభివృద్ధిలో రామోజీ స్ఫూర్తి, ఆలోచనలు ఉన్నాయి. విభజన అనంతరం ఏపీ రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుదని నేను ఆలోచిస్తే ఎంతో పరిశోధన చేసి అమరావతి పేరు పెట్టాలని నాకు సూచించారు. ప్రపంచమంతా అమరావతి అని మారుమోగింది. నూటికి నూరు శాతం ప్రజలు ఆమోదించిన నగరం అమరావతి. గత 5 ఏళ్లు అమరావతి ఇబ్బంది పడినా…మళ్లీ అమరావతి దశ దిశ మారుతుంది…తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. రామోజీ ఎవరినీ ఆయన వద్దకు పిలవరు…తన వద్దకు ఎవరైనా రావాలని కోరుకోరు. వస్తే గౌరవంగా మాట్లాడి…ఉన్నది ఉన్నట్లు చెప్తారు. కొన్ని పత్రికలు ఉన్నాయి…వేరే పార్టీలకు సంబంధించిన వార్తలు ప్రచురించవు…కానీ రామోజీరావు మాత్రం ప్రతి పార్టీకి, నాయకుడి సంఖ్యాబలాన్ని బట్టి ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన అభిప్రాయాలను ఎడిటోరియల్ పేజీలో మాత్రమే రాశారు. నా పాలనపైనా ఎన్నో వార్తలు రాశారు. కానీ ఆయన ఒకే మాట అన్నారు…నేను పత్రికా రంగంలో ఉన్నాను…నన్ను ఎన్నిసార్లు కలిసినా నా స్వేఛ్చకు భంగం కలగకూడదు..మిమ్మల్ని నేను ఏమీ అడగను…నన్ను మీరు ఏమీ అడగొద్దు అని చెప్పి విలువల కోసం బతికారు. పని చేస్తూ కూడా చనిపోవాలని కోరుకున్నారు. నిరంతరం పని చేయాలన్నది ఆయన ఆలోచన. ఈ ఆలోచన కొంత మంది మాత్రమే చేయగలుగుతారు. చనిపోయినప్పుడు కూడా ఎక్కడ అంత్యక్రియలు చేయాలో ముందుగానే నిర్ణయించుకున్నారు.’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగు భాషన్నా…తెలుగు జాతన్నా ఎనలేని ఆప్యాయత
‘తెలుగు భాష అంటే రామోజీకి ఎనలేని అభిమానం…తెలుగుజాతి అంటే ఎనలేని ఆప్యాయత. తెలుగు జాతి, మనదేశం ఎప్పుడూ బాగుండాలని, విలువలతో కూడిన సమాజం ఉండాలని రామోజీ కోరుకున్నారు. తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా…రామోజీ వారసత్వం కొనసాగించాలి. కిరణ్, వారి కుటుంబ సభ్యులను కూడా కోరుతున్నా…రామోజీ, ఆయన స్థాపించిన వ్యవస్థ 10 కోట్ల మంది ప్రజల ఆస్తి. రామోజీ స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలి. తెలుగుజాతిలో ఆయన స్ఫూర్తి ఉండాలి. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని మనమంతా ఎప్పటి నుండో అడుగుతున్నాం…రామోజీరావుకు కూడా భారతరత్న అడగడం మనందరి బాధ్యత. ఎన్టీఆర్, రామోజీరావు ఇద్దరూ ఇద్దరే.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రం ఏర్పాటు
‘‘అమరావతి…రాజధానికి ఆ పేరు పెట్టాలని నాకు సలహా ఇచ్చారు. అందుకే ఆయన గుర్తుండేలా అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాజధానిలో ఏదైనా ఒక రహదారికి రామోజీరావు మార్గం అని పేరు పెడతాం. విశాఖలో ఆయన జీవితాన్ని ప్రారంభించి, పేపరు స్థాపించినందున చిత్రనగరికి రామోజీ చిత్రనగరిగా పేరు పెడతాం. ఎంతోమంది పుడతారు..చనిపోతారు..కొంతమంది మాత్రమే చరిత్రలో నిలుస్తారు. రామోజీరావు లాంటి వారే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు. ఆయన సంస్మరణ సభ నిర్వహించడం నా అదృష్టం. రామోజీరావుకు తగిన గుర్తింపు ఇస్తాం. రామోజీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.’’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.