ఎన్టీఆర్ జిల్లా, జూన్ 29, 2024
ఈవీఎం, వీవీప్యాట్లకు కట్టుదిట్టమైన భద్రత
గోదామును తనిఖీ చేసిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్ డా. జి.సృజన
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీప్యాట్ గోదాము భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు.
శనివారం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ డా. జి.సృజన.. సమన్వయ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి.సృజన మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మూడు నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదామును త్రైమాసిక తనిఖీల్లో భాగంగా నిశితంగా పరిశీలించినట్లు వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తతతో ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈవీఎం, వీవీప్యాట్ల గోదాము తనిఖీ ప్రక్రియలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్వో వి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్ తదితరులతో పాటు వై.రామయ్య (తెదేపా); వై.ఆంజనేయ రెడ్డి, ఎల్.శివరామ ప్రసాద్ (వైఎస్ఆర్సీపీ); బి.కిరణ్ (ఐఎన్సీ), వై.కృష్ణకిషోర్ (నవతరం పార్టీ) తదితరులు పాల్గొన్నారు.