అమరావతి
గృహనిర్మాణంలో లక్ష్యాలు నిర్దేశించుకుంటాం: మంత్రి పార్థసారథి
గృహనిర్మాణంలో లక్ష్యాలు నిర్దేశించుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మూడు నెలలకు ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. గతంలో చేసిన పనులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. లబ్ధిదారులకు నష్టం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్ల నిర్మాణంపై సమగ్ర నివేదిక తయారుచేసి సీఎంతో చర్చిస్తామన్నారు. ఇళ్లకు సరఫరా చేసిన నిర్మాణ సామగ్రిపైనా సమీక్ష నిర్వహించి కార్యాలయానికి అప్లోడ్ అయిన బిల్లులను విడుదల చేస్తామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో ఇళ్లు కేటాయించారని, గృహ నిర్మాణంలో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు కూడా వాడుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.