స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.250 కోట్లు విడుదల
సియం ఎన్నికల వాగ్దానంలో భాగంగా నిధులు విడుదల
రాష్ట్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్
అమరావతి,11 జూలై:రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15 వ ఆర్ధిక సంఘం నిధులు రూ.250 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక,ప్రణాళిక,వాణిజ్య,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు.ఈమేరకు గురువారం రాష్ట్ర సచివాలయం రెండవ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15 ఆర్ధిక సంఘం నిధులు రూ.250 కోట్లను విడుదల చేస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వివిధ గ్రామ పంచాయితీలకు మొదటి విడతగా 15వ ఆర్ధిక సంఘం నిధులను విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్,కార్యదర్శులు డా.కెవివి. సత్యనారాయణ,జానకి, వినయ్ చంద్,చీఫ్ కమీషనర్ స్టేట్ ట్యాక్సెస్ గిరిజా శంకర్ ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరి కె.ఆదినారాయణ,డైరెక్టర్ ట్రెజరీస్ మోహన్ రావు,ఎపి జిఎల్ఐ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు మంత్రి వర్యులకు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఇంకా ఈకార్యక్రమంలో పలువురు సంబంధిత శాఖల అధికారులు,ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.