ఏలూరు,/వేలేరుపాడు, జూలై ,20 : పెదవాగు కు ఆకస్మిక వరదల కారణంగా ఏలూరు జిల్లాలో 12 గ్రామాల తీవ్రంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.
వేలేరుపాడు మండలంలో శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పెదవాగు ప్రాజెక్ట్ ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఉన్నదని, ప్రాజెక్ట్ నిర్వహణ తెలంగాణా ప్రభుత్వం . సాధారణ వర్షపాతం కంటే మూడింతలు ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు. గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్ లో అధికంగా వరద నీరు నీరు చేరుకోవడంతో పెదవాగు ప్రాజెక్ట్ 200 మీటర్ల మేర దెబ్బతినడంతో, వరదనీరు వేలేరుపాడు, కుక్కునూరు మండలంలోని 7 గ్రామ పంచాయతీలకు చెందిన 12 గ్రామాలు వరద తీవ్రతకు దెబ్బతిన్నాయన్నారు. ప్రాధమిక అంచనాల ప్రకారం వరదల కారణంగా 7 వేల 450 ఎకరాలలో వరి పంట దెబ్బతిన్నదని, 290 ఎకరాల్లో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయన్నారు. 106 ఎకరాల్లో ఉద్యానవనాలు పంటలు దెబ్బతిన్నాయన్నారు. వరద నీరు తగ్గిన వెంటనే నష్టాలపై గణన చేపట్టడం జరుగుతుందన్నారు. వరదలలో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. గత 3 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరద పరిస్థితిపై జిల్లా యంత్రాంగాన్ని, ప్రజాప్రఠీనిధులను ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారన్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ కార్యక్రమాలు అందించాల్సిందిగా అధికారులను, సిబ్బందిని ఆదేశించడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు కార్యకర్తల సహాయంతో సేవలు అందిస్తున్నందుకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి అభినందించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యావేణి, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఎం. సూర్యతేజ, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, ప్రభృతులు పాల్గొన్నారు.