రాష్ట్రంలో పంటల ప్రాధమిక నష్టాన్ని అంచనా వేసి, పంట నష్టపరిహారం త్వరగా రైతులకు అందించాలి బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అద్యక్షులు చిగురుపాటి కుమారస్వామి
మంగళగిరి ప్రతినిధి: రాష్ట్రంలో పంటల ప్రాధమిక నష్టాన్ని అంచనా వేసి, పంట నష్టపరిహారం త్వరగా రైతులకు అందించాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ మరియు డైరెక్టర్ శ్రీయుత యస్. ఢిల్లీ రావు ఐ.ఏ.యస్.ని కలిసి వారికీ వినతి పత్రాన్ని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అద్యక్షులు చిగురుపాటి కుమారస్వామి అందించడం జరిగింది. గత 10 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో దాదాపు 18 జిల్లాలలో పంటలకు నష్టం వాటిల్లగా, లక్షల ఎకరాలకు పైగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వరి, మినుము, పెసర, నువ్వులు, కూరగాయలు, బొప్పాయి, అరటి తదితర పంటలు పూర్తిగా నష్టపోయారన్నారు. రైతులకు భరోసా నిచ్చి, త్వరగా పంట నష్టపరిహారం అందించే కార్యాచరణ చేపట్టాలని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. రాయితీపై నాణ్యమైన విత్తనాలు, కౌలు రైతులకు పంట రుణాలు, సాగునీటి మరియు మురుగు నీటి కాలువలు మరమత్తులు, పంటల బీమా విషయంలో సరైన విధానాల రూపకల్పన వంటి విషయాలలో కొత్త ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకుంటుందని రైతాంగం ఎదురు చూస్తున్న నేపథ్యంలో, వ్యవసాయ శాఖ వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేస్తుందని అన్నారు. విత్తన సేకరణ మరియు పంపిణీలో అవినీతి కారణంగా సరైన విత్తనం లభించక రైతులు నష్టపోయారన్నారు. కౌలు రైతులపై సమగ్ర అధ్యయనం చేసి, వారికి భూయజమానులతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు అందచేసి, బ్యాంకుల ద్వారా పంట రుణాలు, పంట నష్టపరిహారం నేరుగా అందించే విధంగా తగిన కార్యాచరణ చేపట్టాలని కుమారస్వామి అన్నారు. వెంటనే డెల్టా ప్రాంతంలో మురుగు నీటి కాలువలు పూడిక తీసే కార్యక్రమం చేపట్టాలని, సాగునీటి పారుదల వ్యవస్థకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలన్నారు. సాగునీటి సంఘాలను పునరుద్ధరించి ప్రాంతాలవారీగా కాలువల ఆధునికీకరణ చేపట్టాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంటల బీమా పధకం పడకేయడంతో, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, నాణ్యతలేని విత్తనాలతో పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా అమలుకాక తీవ్రంగా నష్టపోయి అప్పులపాలైనారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడం వలన ఉద్యానవన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ ప్రభుత్వం రైతుల సమస్యలను అర్థం చేసుకొని వ్యవసాయ పనిముట్లు, స్ప్రింకలర్స్, డ్రిప్ పరికరాలు మంజూరు చేయాలని కుమారస్వామి వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ మరియు డైరెక్టర్ శ్రీయుత యస్. ఢిల్లీ రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సురేంద్ర రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి.సుబ్బారావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.పాండురంగ విఠల్, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, సాంబశివరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు, మరియు రాష్ట్ర, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.