07-08-2024
టిడిపికి జగన్ శతృవు కాదు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే : రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా
దేశంలోనే అభద్రత భావంతో వున్న వ్యక్తి జగన్ రెడ్డి
సీఎం స్థాయి భద్రత కోరటం పై ఆగ్రహం
సీఎం చంద్రబాబు విలువలు తెలిసిన నేత
ప్రజాస్వామ్యం, భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయిన జగన్
ప్రజాస్వామ్యంపై గౌరవం వుంటే పెద్దిరెడ్డిని సస్పెండ్ చేయాలి
ఇంకా ముఖ్యమంత్రి అనే మత్తులోనే జగన్
ప్రతిపక్ష హోదా దక్కని జగన్ తన స్థాయి గుర్తించాలి
విజయవాడ : ముఖ్యమంత్రి స్థాయి భదత్ర కావాలని, ముఖ్యమంత్రి హోదాలో తనకు కల్పించిన భద్రతను పునరుద్దరించాలంటూ వైసిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడగటం పై టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్ మీరా నిప్పులు చేరిగారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్, ఎమ్మెల్యే గా ముఖ్యమంత్రి స్థాయి భద్రత కోరుకోవటం చూస్తే జగన్ పిచ్చి పరాకాష్టకు వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ కి ఇవ్వాల్సినంత భద్రత ఇస్తున్న, ముఖ్యమంత్రి స్థాయి భద్రత అడగటానికి ప్రశ్నిస్తూ నాగుల్ మీరా గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా నాగుల్ మీరా మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయి భద్రత ఎవరికి ఇస్తారో తెలియని వ్యక్తి జగన్ ని గతంలో ముఖ్యమంత్రి గా ఎన్నుకున్నందుకు రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. గులకరాయి, కోడి కత్తి డ్రామాలు కారణాలుగా చూపిస్తే ముఖ్యమంత్రి స్థాయి భద్రత కేటాయిస్తారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఏ భదత్ర వుంటుంది. ప్రతిపక్ష హోదా నాయకుడికి ఏ భద్రత వుంటుందో జగన్ తెలుసుకుని మాట్లాడాలన్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన జగన్ అంత భారీ భద్రత అడుగుతున్నాడంటే ఎంత అభద్రత భావంలో వున్నాడో అర్ధమవుతుందన్నారు.
పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కి తగిన గౌరవం ఎలా ఇవ్వాలో జగన్ ఇవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలువలు తెలిసిన వ్యక్తి అందుకే వైసిపికి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వున్న, ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీలోకి జగన్ కారు అనుమతించారని తెలిపారు. రాష్ట్రంలో జగన్ కి ఎలాంటి ప్రమాదం లేదు. ఒక వేళ ఎలాంటి ప్రమాదమైన పొంచి వుంటే అది వైసిపి నాయకుల నుంచే వుంటుందని హెచ్చరించారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్ ని ప్రజలు తిరస్కరించారనే విషయం గమనించాలన్నారు. టిడిపి కి జగన్ శత్రువు కాదు..కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని చెప్పారు. జగన్ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఎన్నికల్లో చిత్తు చిత్తు గా ఓడించటం జరిగిందన్నారు. ఇందుకు ప్రజలు సహకరించారన్నారు.
ప్రతి పక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. అయినా సీఎం చంద్రబాబు నాయుడు జెడ్ ప్లస్ కేటగిరీ కేటాయించటం జరిగిందన్నారు. భద్రతాపరంగా జెడ్ ప్లస్ విభాగం అత్యధిక స్థాయి. అంతకు మించిన భద్రత మరెవరికీ కల్పించరు. ఈ కేటగిరీలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం 58 మంది భద్రతా సిబ్బందిని ఇస్తుంది. ఇప్పుడు కూడా జగన్కు ఇదే భద్రత కొనసాగుతోందని తెలిపారు.
జగన్ తన హయంలో జెడ్ ప్లస్ వున్న చంద్రబాబు కి తగిన గౌరవం ఇచ్చాడా అని ప్రశ్నించాడు.రాష్ట్రానికి
ముఖ్యమంత్రులుగా చేసిన వై.ఎస్.ఆర్., రోశయ్య, కిరణ్ కుమారు రెడ్డి ఈ ముగ్గురు జెడ్ ప్లస్ భద్రత వున్న చంద్రబాబు కి తగిన గౌరవం ఇవ్వటం జరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబు ఏదైనా కార్యక్రమానికి హాజరైతే డి.సి.పి, ఎ.సి.పి. సి.ఐ., ఎస్.ఐల పర్యవేక్షణలో కార్యక్రమం జరిగేది. జగన్ హయంలో జడ్ ప్లస్ కేటగిరీ భద్రత వున్న చంద్రబాబు కి ఇద్దరు ఎస్.ఐలను కేటాయించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి భద్రత ఒక్కటే కాదు…ప్రతి పౌరుడి భద్రత చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి వుందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమలు అవుతుందని తెలిపారు. జగన్ కి ప్రజాస్వామ్యం గురించి, భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కి లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం పై గౌరవం వుంటే వందల ఎకరాలు దోచుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో ఎవరిపై దాడులు జరగటం లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో విఘాతం కలిగిస్తే ఎవరినైనా చంద్రబాబు ఉపేక్షించరని తెలిపారు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు వుంటేనే పెట్టుబడులు వస్తాయని ఆకాంక్షిస్తూ రాష్ట్రాన్ని ఆ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారన్నారు.