యువత స్వయం సమృద్ధి సాధించాలి
ఎమ్మెల్యే సుజనా చౌదరి
స్వదేశీ జాగరణ మంచ్,
ఆధ్వర్యంలో స్వదేశీ స్వావలంబన, రాష్ట్ర మహాసభను, ఆదివారం కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్బర భారత్ స్ఫూర్తితో రూపొందించిన స్వావలంబి భారత్ అభియాన్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందన్నారు. దేశంలో ఉన్న అన్ని రకాల వృత్తులను కాపాడటానికి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధి సాధించాలన్నారు. స్వదేశీ జాగరణ మంచ్ స్ఫూర్తి ,రైతాంగాన్ని కాపాడటం, చిన్న తరహా పరిశ్రమలు , చేతి వృత్తులను ప్రోత్సహించడం, జరుగుతుందన్నారు. స్వదేశీ ఉత్పత్తులను వాడటం ద్వారా స్వయం సమృద్ధి సాధించొచ్చు అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను వాడాలని తద్వారా చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చెంది స్థానికంగా ఉపాధి పెరిగి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రధాని మోదీ అందిస్తున్న రుణాలను యువత సద్వినియోగం చేసుకొని చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పి ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. యువత ఉద్యోగం చేయడం కాకుండా ఉద్యోగాలను కల్పించాలన్నారు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి స్వదేశీ వ్యాపారులను ప్రోత్సహించాలని స్వదేశీ జాగరణ మంచ్ నేషనల్ కో- కన్వీనర్ అజయ్ పాట్కి అన్నారు. వోకల్ ఫర్ లోకల్ నినాద స్ఫూర్తితో అన్నింటా భారతీయ భావం నెలకొంటుందని అదే స్వదేశీ జాగరణ మంచ్ లక్ష్యం అన్నారు. యువతను, వ్యాపారులను, ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు, చిన్న తరహా పరిశ్రమలకు అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ ఆల్ ఇండియా అధ్యక్షులు కుమార్ స్వామి, స్వావలంబి భారత్ అభియాన్ ఏపీ అధ్యక్షులు అంజనీ శ్రీనివాస్, స్వదేశీ జాగరణ మంచ్ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ హేమంత్ ,బోయపాటి నాని చౌదరి, మహిళా ప్రముఖ్ పావని, ఆదిలక్ష్మి, స్వదేశీ జాగరణ మంచ్ ప్రతినిధులు, పాల్గొన్నారు.