గంజాయి గుప్పు… గాజువాకకు ముప్పు
కూడు పోయింది… గూడు పోయింది
16 ఏళ్లయినా గంగవరం పోర్టు నిర్వాసితుల హామీలు అమలు కాలేదు
జనసేన గ్రీవెన్స్ కు విజ్ఞప్తుల వెల్లువ
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్
కట్టుకున్న గూడు పోయింది… కడుపు నింపే ఉపాధి కోల్పోయాం…16 ఏళ్లవుతున్నా ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని గంగవరం పోర్టు బాధితుల ఆవేదన.
గాజువాక పరిసరాల్లో గంజాయి గుప్పుమంటోంది. స్కూలు పిల్లలు సైతం గంజాయి మత్తుకు బానిసలవుతున్నారని ఓ తల్లి ఆక్రోశం. కొణిదల అన్న ఇంటి పేరు ఉందని వైసీపీ ప్రభుత్వం నా ఉద్యోగం పీకేసిందని ఓ యువకుడి వ్యథ. జనసేన గ్రీవెన్స్ కు వెల్లువలా తరలివస్తున్న వినతులు ఇవి. బుధవారం నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి కృషి చేశారు.
• గంగవరం పోర్టు నిర్మాణం కోసం దిబ్బపాలెం, గంగవరం పల్లెపాలెం, జాలారి పల్లెపాలెం, చిన్న పల్లెపాలెం, పెద్ద పల్లెపాలెం గ్రామాలను ఖాళీ చేయించారు. యారాడ సముద్ర తీర ప్రాంతంలో జెట్టీ నిర్మాణం చేస్తామని… జెట్టీ నిర్మాణం జరిగే వరకు రూ.3 వేల చొప్పున జీవన భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోర్టు నిర్మాణం జరిగి 16 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఆ హామీలను నెరవేర్చలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు నిర్మాణం జరిగితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తే… 15 వేల మంది పోర్టు బాధితులు ఉంటే కేవలం 500 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించారని వాపోయారు. పోర్టు నిర్మాణ సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
• గాజువాక పరిసరాల్లో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. యువతతో పాటు స్కూలు పిల్లలు సైతం గంజాయికి బానిసలుగా మారుతున్నారు. తక్షణం గంజాయి అమ్మకాల నియంత్రణ చర్యలు చేపట్టాలి అని జీవీఎంసీ 68వ వార్డుకు చెందిన శ్రీమతి షాలిని అనే మహిళ ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు, స్థానిక పోలీసుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు.
• సమగ్ర శిక్షా ప్రాజెక్టును విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. కేజీబీవీ స్కూల్స్ లో పనిచేస్తోన్న గెస్ట్, నాన్ టీచింగ్, డైలీ వేజెస్ సిబ్బందిని రెన్యువల్ చేయాలని కోరింది. పదవి విరమణ వయసు 62 ఏళ్లుకు పెంచి, ఈఎస్ఐ, పి.ఎఫ్ అమలు చేయాలని కోరింది.
• గంగ తెప్పోత్సవాన్ని రాష్ట్ర పండుగుల జాబితాలో చేర్చాలని రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి విజ్ఞప్తి చేసింది. చేపల వేట విరామ సమయంలో రామలసీమ బెస్త సహకార సంఘాల సభ్యులకు కూడా మత్స్యకార భరోసా కల్పించాలని కోరింది. ప్రతి జిల్లాలో మాడ్రస్ చేపల మార్కెట్ నిర్మాణం చేసి వాటి నిర్వహణ బెస్తలకు ఇవ్వాలని, ఎన్ఆర్జీఎస్ కింద చెరువులు పూడిక తీసే పనులను మత్స్యకార సహకార సంఘాలకు కేటాయించాలని కోరింది. పార్లమెంట్ పరిధిలో కమ్యూనిటీ హాలు చేపట్టాలని, విశ్వవిద్యాలయాల్లో మత్స్యకార అనుబంధ కోర్సులు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేసింది.
• కొణిదల అన్న ఇంటి పేరు ఉందని వైసీపీ ప్రభుత్వం ఉద్యోగం తీసేసింది. డిస్టలరీస్ బెవరేజస్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజర్ గా 10 ఏళ్ల అనుభవం ఉంది. నా అర్హతకు తగిన ఉద్యోగం ఇప్పించగలరని చిత్తూరు జిల్లా, కుప్పం పట్టణానికి చెందిన ఆనంద్ కుమార్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆశ్రయించారు. జనవాణి కార్యక్రమంలో అర్జీ స్వీకరించిన బొమ్మిడి నాయకర్ ఓ డిస్టలరీ కంపెనీ హెడ్ తో మాట్లాడి ఉద్యోగం ఇచ్చేందుకు ఒప్పించారు.
• పక్షవాతంతో నా కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. పని చేసే శక్తి లేదు. పెన్షన్ ఇప్పించాలని విజయవాడకు చెందిన షేక్ షంషాద్ విజ్ఞప్తి చేశారు.
• ‘భర్త ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారనీ, ముగ్గురు ఆడ పిల్లలు. సొంత ఇళ్లు లేక ఇబ్బందిపడుతున్నాము. దయ చేసి మాకు నీడ కల్పించే ఏర్పాటు చేయాల’ని గుంటూరు జిల్లా లింగంగుంట పాలెంకు చెందిన శ్రీమతి బుజ్జి అనే మహిళ కోరారు. రీ సర్వేలో తన భూమి వేరొకరి భూమిలో కలిసిందని, పాత రికార్డుల ప్రకారం తన భూమి తనకు అప్పగించాలని తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరుకు చెందిన పాలడుగుల రామకృష్ణారావు కోరారు. ఇలా పలువురు ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు జనసేన గ్రీవెన్స్ కు తరలివచ్చారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ అందించాలని, వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని, సొంతింటి కల నెరవేర్చాలని, విద్య, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని అర్జీదారులు విజ్ఞప్తి చేశారు. వారందరి దగ్గర నుంచి బొమ్మిడి నాయకర్ నేరుగా వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, బేతపూడి విజయ్ శేఖర్, సుందర రామిరెడ్డి, దోవారి పవిత్ర, లీగల్ సెల్ సభ్యులు గ్రంధం శ్రీనివాసరావు, సనక సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.