జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతోనే వరదముంపు.
రూ.220 కోట్ల బుడమేరు ఆధునికీకరణ పనులు అటకెక్కించారు.
సాక్షి మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది.
ఇది టెర్రరిజం కంటే మరింత ప్రమాదకరం.
బీడీసీకి పడిన గండ్లు యుద్ధప్రాతిపదికన పూడ్చివేత.
పనులు పరిశీలించిన మంత్రులు లోకేష్ రామానాయుడు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, 07.09.2024.
కొండపల్లి శాంతినగర్-కవులూరు గ్రామాల మధ్య బుడమేరు మళ్లింపు కాల్వకు పడిన గండ్లను పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పనులు తుదిదశకు చేరుకున్నాయి.
గండ్లు పూడ్చివేత పనులను ఏపీ మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు , మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు, ఎన్డీఏ మహాకూటమి నేతలు శనివారం ఉదయం పరిశీలించారు. ఆర్మీ ఏర్పాటు చేసిన రక్షణ ఇనుప కంచెను పరిశీలించారు. బీడీసీ కరకట్టలు యధాస్థితికి చేరుకునే వరకు పనులు కొనసాగించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ
మంత్రి నారా లోకేష్ మొదటిరోజున గండ్లు పరిశీలించి, విలువైన సలహాలు సూచనల మేరకు సాధ్యమైనంత త్వరగా గండ్లు పూర్తి చేశామని అన్నారు.
వరద కారణంగా బుడమేరు వరద మళ్లింపు కాలువ (బీడీసీ) ఎడమ కట్టకు పడిన గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. మొత్తం 3 ప్రధాన గండ్లలో ఇప్పటికే 2 గండ్లు పూడ్చగా అతి పెద్ద దైన మూడో గండి పూడ్చివేత శనివారం ఉదయానికి తుదిదశకు చేరిందన్నారు. మరికొద్ది సేపట్లో గండ్లు పూడ్చివేత పూర్తి అవుతుందన్నారు.
బుడమేటి వరద విజయవాడ పల్లపు ప్రాంతాలను నీటిలో ముంచెత్తిన విషయం తెలిసిందే. బుడమేరు వరద నుంచి బాధితులను కాపాడేందుకు, సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు.
దీనిపై సీఎం చంద్రబాబునాయుడు కేంద్రంతో మాట్లాడి సైన్యాన్ని రంగంలోకి దించారన్నారు. మద్రాసు 6వ బెటాలియన్ నుంచి 120 మంది జవాన్లు వచ్చారు. తాత్కాలికంగా ఇనుప రాడ్లతో వంతెనలా కట్టి నిరాటంకంగా పనులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి 4వ కిమీ వద్ద 60 మీటర్లు, 41 కిమీ వద్ద 50 మీటర్ల మేర పడిన గండ్లలో 4.1, 4 కిమీ వద్ద ఏర్పడిన గండ్లను శుక్రవారం మధ్యాహ్నానికి పూడ్చివేశారన్నారు. 39వ కిమీ వద్ద పడిన 100 మీటర్ల భారీ గండిని పూడ్చే పనులు నేడు పూర్తి కానున్నాయని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు తెలిపారు.
వరద పెరిగినా, వర్షం ఆటంకం కలిగించినా, కట్టలు జారుతున్నా మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు రేయింబవళ్లు, వర్షంలో తడుస్తూ ఇక్కడే ఉండి పనులు మాత్రం ఆపకుండా ముందుకు కొనసాగించారని పేర్కొన్నారు.
సాక్షి ఛానెల్, పత్రిక దుష్ప్రచారం చేస్తున్నాయి.
బుడమేరు వరద నీటి ముంపు గురించి సాక్షి ఛానల్ మీడియా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పై, రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ధ్వజమెత్తారు. 2020లో రూ.220 కోట్ల అంచనా వ్యయంతో వైసీపీ ప్రభుత్వంలో బుడమేరు ఆధునికీకరణ పనులను తను భూమి పూజ చేశానన్నారు. కానీ 23 కోట్ల రూపాయల పనులు పూర్తి కాగానే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధునికరణ పనులను అర్ధంతరంగా నిలిపివేసిందన్నారు. దాని పర్యవసారమే నేడు బుడుమేరు కరకట్టలు తెగి వరద నీరు బెజవాడను ముంచెత్తిందన్నారు. ఈ ముంపు పాపం అంతా గత ప్రభుత్వానిదేనన్నారు.
తాజాగా జరిగిన విపత్తులో మానవ తప్పిదం లేదన్నారు. కృష్ణానదికి వరద, భారీ వర్షపాతం నమోదు, ఎగువన బుడమేరు క్యాచ్ మెంట్ ఏరియాలో అకాల వర్షాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్ వచ్చిందనన్నారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తకపోతే రెగ్యులేటర్ మొత్తం కొట్టుకుపోయి ఉండేదన్నారు. నియోజకవర్గంలో దాదాపు 25 చెరువుల కట్టలు ఒక్కసారే తెగిపోయాయన్నారు. 10 వేల క్యూసెక్కుల వరద నీరు సామర్ధ్యం కలిగిన బీడీసీ సుమారు 40 వేల క్యూసెక్కుల వరదను తట్టుకోలేక ప్రధానంగా గండ్లు పడ్డాయన్నారు. సాక్షి మీడియా వాస్తవాలను కప్పి పుచ్చి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందన్నారు. సాక్షి విషపు రాతలు టెర్రరిజం కంటే ప్రమాదకరమన్నారు. ఇటువంటి విపత్తులో సాయపడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై బురద జల్లుతూ జగన్ మోహన్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు వరదముంపు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతోనే జరిగిందన్నారు. స్థానిక ఎన్డీఏ మహాకూటమి నేతలు పాల్గొన్నారు.