అధైర్య పడొద్దు అండగా ఉంటాం
ఎమ్మెల్యే సుజనా చౌదరి
38వ డివిజన్ కుమ్మరిపాలెం ప్రాంత వరద బాధితులతో పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) కానూరు కెసిపి కాలనీ లోని తమ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు.
బాధిత మహిళలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను విన్నారు. వరదలతో నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. నివేదికల ఆధారంగా ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తుందని తెలియజేశారు. బాధితులు ఎవరుకూడా అధైర్య పడోద్దని ప్రతి ఒక్కరికి పరిహారం అందే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విపత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధాని మోడీతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. అనుకోకుండా సంభవించిన వరద విపత్తు వలన ఏపీకి భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ బాధితుల కోసం విరాళాలను సేకరిస్తూ శరవేగంగా కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. వరద విపత్తు సమయంలో సుజనా ఫౌండేషన్ సిబ్బంది, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, కూటమినేతల సహకారంతో బాధితులకు అండగా నిలిచామన్నారు.
ప్రతిపక్ష హోదా కూడా లేని కొంతమంది నేతల మాటలు విని బాధితులు తొందరపడద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి పరిహారాన్ని అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కార్యక్రమంలో కూటమినేతలు పితాని పద్మ, తమ్మిన లీల కరుణాకర్, గన్ను శంకర్, సురభిబాలు కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.