వరద బాధితులకు నిత్యావసర కిట్స్ పంపిణీ.
కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 03.10.2024.
మైలవరం నియోజకవర్గంలోని వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎమ్ కాలనీలో వరద బాధిత కుటుంబాలకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు నిత్యవసర వస్తువుల కిట్లను గురువారం పంపిణీ చేశారు. ఎస్.బి.ఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, రౌండ్ టేబుల్ ఇండియా ట్రస్ట్ వారి సంయుక్త సౌజన్యంతో బాధిత కుటుంబాలకు చేయూతనిచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వరద ఉధృతిని చవిచూశామన్నారు. కృష్ణమ్మకు ఎగువన వరదలు, తీవ్ర వర్షపాతం, నియోజకవర్గంలో 50 పైగా చెరువుల కట్టలు ఒక్కసారిగా తెగటం, కవులూరు వద్ద బీడీసీ కరకట్ట తెగి భారీ గండ్లు పడటంతో వరద నీరు జనావాసాల్లో ముంచెత్తిందన్నారు.
సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎమ్ కాలనీలో వరద నీటిలో నడిచి బాధితులకు అండగా నిలబడ్డారన్నారు. వైఎస్సార్ కాలనీ అంటే తన కుటుంబంలా సీఎం చంద్రబాబు భావించారన్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి ఆహార పదార్థాలు రప్పించి వాటిని సకాలంలో బాధితులకు అందజేశారన్నారు. దేశ చరిత్రలోనే లేని విధంగా ఒక్క విజయవాడలోనే సీఎం రూ.600 కోట్ల విపత్తు సాయాన్ని విడుదల చేశారన్నారు. పంట నష్ట పరిహారం కూడా విడుదల చేసి రైతులను ఆదుకున్నారన్నారు.
ప్రకృతి ప్రకోపం వల్ల ఇంతటి విధ్వంసం జరిగిందని, మహాకూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో త్వరగా ఉపశమనం కలిగిందన్నారు. ఇప్పటికే ప్రకృతి విపత్తు సాయాన్ని నేరుగా బాధితుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా రావలసిన వారికి త్వరలోనే సాయం అందుతుందన్నారు. టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు కూడా ఓ పక్కన జ్వరంతో బాధపడుతున్నప్పటికీ బాధితులకు సేవలు అందించారన్నారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.