నాగార్జున పిటిషన్పై విచారణ వాయిదా.. కారణం ఇదే
రాజకీయవర్గాలతో పాటు సినీ పరిశ్రమలోనూ మంత్రి సురేఖ వ్యాఖ్యల దుమారం
మంత్రిపై నాంపల్లి కోర్టులో నాగార్జున పరువునష్టం దావా
న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయాలతో పాటు అటు సినీ పరిశ్రమల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రిపై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు.
అయితే, న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. సోమవారం దీనిపై విచారణ జరగనుంది.
ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనీ నటుడు నాగార్జున, ఆయన కుమారుడు నాగచైతన్యపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఆపడానికి, కేటీఆర్ ఓ ‘షరతు’ విధించారని, దాంతో ఆ ‘షరతు’ను అంగీకరించాలంటూ సమంతను ఆమె భర్త నాగచైతన్య, నాగార్జున ఒత్తిడి చేశారని తెలిపారు. అయితే, దీనికి సమంత ఒప్పుకోలేదని సురేఖ చెప్పారు.
ఒప్పుకోకపోతే తమ ఇంటి నుంచి వెళ్లిపోవాలని సమంతకు నాగార్జున స్పష్టం చేశారని… ఈ కారణంతోనే, ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ఆ తర్వాత నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్నారని చెప్పారు.
అయితే, నిన్న మంత్రి సురేఖ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సమంతకు క్షమాపణలు కూడా చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే అని మంత్రి అన్నారు. బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
కాగా, ఆమె వ్యాఖ్యలపై తెలుగు చిత్ర సీమ భగ్గుమన్న విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ, సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.