శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన చిట్టినగర్ అమ్మవారు
విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 6 : స్థానిక చిట్టినగర్ లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న దసరా మహోత్సవంలో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నపూర్ణాదేవి అలంకారంతో ఉన్నఅమ్మవారిని దర్శించుకుని పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, గౌరవాధ్యక్షులు బెవర సూర్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారిని ప్రతినిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారని చెప్పారు. అలాగే వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు వివరించారు. దసరా సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటిలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం వేళల్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు భక్తుల నుంచి మంచి ఆదరణ కనబడుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ ఉపాధ్యక్షులు బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గాప్రసాద్ (రాజా), శీరం వెంకట్రావు, కార్యవర్గ సభ్యులు మజ్జి ఈశ్వరరావు, తొత్తడి భరత్ కుమార్ , పోతిన సాంబశివరావు, భోగవల్లి శ్రీధర్ , ముదిలి గణేష్, బంక హనుమంతరావు, ఈది ఎల్లా రాజారావు, పిళ్లా విజయ్ కుమార్, మజ్జి శ్రీనివాసరావు పోతిన వెంకట ధర్మారావు, గూడేల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.