*ఇంద్రకీలాద్రి*
అక్టోబర్ 8, 2024
ఇంద్రకీలాద్రి వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.
ఆరో రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారని.. బుధవారం మూలా నక్షత్రం పవిత్ర రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది ఎదురుచూస్తున్నారని.. ముఖ్యంగా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 13 శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వేకువజామున మూడు గంటల నుంచి రాత్రి 11, 11.30 గంటల వరకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. రేపు అన్ని క్యూలైన్లలో ఉచితంగా దర్శనం చేసుకోవచ్చని రూ. 500, రూ. 300, రూ. 100 టికెట్లు ఉండవని తెలిపారు. అదేవిధంగా సాయంత్రం 4, 5 గంటల వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేయడం జరిగిందని.. సామాన్య భక్తుల సౌకర్యార్థం దేవదాయ శాఖ మంత్రి, కమిషనర్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికీ సర్వదర్శనం ఉంటుందన్నారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ప్రతి భక్తునికి ఒక లడ్డును ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. భక్తులెవరూ సొంత వాహనాల్లో రావద్దని దేవస్థానం వారు ఏర్పాటు చేసిన మినీ బస్సులు, వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని.. ఈ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య జరుగుతుందన్నారు. ఆలయ మర్యాదలతో సంప్రదాయాలతో గౌరవ ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు. ప్రోటోకాల్ ఉన్న కొద్ది మందికి మాత్రమే అంతరాలయంలో ప్రవేశం ఉంటుందని తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేసి మూలా నక్షత్రం రోజున ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.
91 శాతం సంతృప్త స్థాయి నమోదు
అమ్మవారి దర్శనానికి సంబంధించి ఐవీఆర్ఎస్ ద్వారా 3,197 మంది నుంచి అభిప్రాయాలు తీసుకోగా 91.27 శాతం సంతృప్తి స్థాయి నమోదు అయిందని.. ఈ స్థాయిని 100 శాతానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.