గురువారం రాత్రి ఇంద్రకీలాద్రి వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ..
శ్రీ దుర్గాదేవి అలంకృత అమ్మవారు గురువారం భక్తులకు దర్శనం ఇచ్చారని.. దుర్గాష్టమి రోజున ఇంద్రకీలాద్రిపై గొప్ప వైదిక సభ నిర్వహించడం జరిగిందని.. ఈ సభలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది హాజరై వేద పఠనం జరిపారన్నారు. ఓ గొప్ప ఆనవాయితీని కొనసాగించడం.. వైదిక జ్ఞానాన్ని భావితరాలకు అందించే ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వేద పఠనం వింటుంటే శరీరంలోని అణువు అణువు వేదాల వైపు అడుగులు వేసాయనడంలో ఎలాంటి సందేహము లేదు. *రేపటి తరానికి వేద విజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి జిల్లాలో వైదిక సభలను నిర్వహించే అంశాన్ని ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని తెలిపారు.*
ఆలయాల సంప్రదాయాలు, వైదిక ధర్మాలను కాపాడే విషయంలో వేద పండితుల నిర్ణయాలు కీలకమని పేర్కొన్నారు.
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని.. పెద్ద
ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీన విజయదశమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆరోజు కూడా ఐదు లైన్ల ద్వారా ఉచితంగా భక్తులకు అమ్మవారి దర్శనం భాగ్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఎలాంటి టికెట్లు లేకుండానే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. విజయదశమి రోజు ప్రతి భక్తునికి ఉచితంగా లడ్డు వితరణ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భవానీ మాలధారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈరోజు రాత్రి 9 గంటల వరకు చూస్తే దాదాపు 64 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు..