అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు
113 దుకాణాలకు దరఖాస్తుదారుల సమక్షంలో పూర్తయిన లాటరీ ప్రక్రియ
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 113 ప్రైవేటు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టి, విజయవంతంగా పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు.
రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ, గురునానక్ కాలనీ ఎన్ఏసీ కళ్యాణమండపంలో నూతన మద్యం విధానానికి (2024-26) సంబంధించి లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 113 మద్యం షాపులకు 5,825 మంది దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, పటిష్ట ప్రణాళికతో జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, జాయింట్ కలెక్టర్ డా. నిధిమీనా ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ గెజిట్ సీరియల్ నంబరు ప్రకారం లాటరీ ద్వారా దరఖాస్తుదారుల సమక్షంలో పూర్తి పారదర్శకంగా దుకాణాలను కేటాయించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాస్, జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎస్.శ్రీనివాసరావు ఒక బృందంగా, జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధిమీనా, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిస్టిలరీస్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి.స్వాతి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్వీ రామశివ మరో బృందంగా లాటరీ ప్రక్రియను నిర్వహించినట్లు వివరించారు. రెండు హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీ టీవీ కెమెరాల నిఘా మధ్య షాపుల వారీగా లాటరీ ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు.
పోలీస్, ట్రాఫిక్తో పాటు వివిధ శాఖల సమన్వయంతో ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా పూర్తిచేసినట్లు కలెక్టర్ సృజన వివరించారు.