ఉద్యోగుల జీపీఎఫ్, సరెండర్ లీవ్ వంటి పెండింగ్ బకాయిలు చెల్లించండి
పీఆర్సీ కమిషన్ తక్షణమే నియమించాలి.
ఎన్జీవో నేత ఎ. విద్యాసాగర్.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, గత ఐదు సంవత్సరాలుగా చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించుటకు తగిన చర్యలు తీసుకోనేల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ తెలిపారు. రాష్ట్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జేఏసీ/ఎన్జీజివో సంఘ పిలుపుమేరకు వరద బాధితుల సహాయార్థం 120 కోట్ల రూపాయల పైగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించిన ప్రతి ఉద్యోగిని అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ విజయవాడ నగర శాఖ కార్యవర్గ సమావేశం శనివారం ఎన్జీవో హోమ్ నందు నగర అధ్యక్షుడు సిహెచ్ వి ఆర్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పెడచెవిన పెట్టడంతో పాటు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో పూర్తి అలసత్వాన్ని ప్రదర్శించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆరు విడతల కరువు భత్యం బకాయిలు, పీఆర్సీ ఎరియర్స్ ను చెల్లించక పోగా ఉద్యోగుల జిపిఫ్, ఎపిజిఎల్ఐ ఖాతాలలో దాచుకున్న సొమ్ము నుండి రుణాలను మంజూరు చేయడం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపడంతో ఉద్యోగులు అసహనానికి గురయ్యారన్నారు. గత మూడు సంవత్సరాలుగా సరెండర్ లీవ్ చెల్లింపులు జరగలేదన్నారు. గత ప్రభుత్వం దాదాపు 20 వేల కోట్ల రూపాయలకు పైగా ఉద్యోగుల బకాయిలను పెండింగ్ లో పెట్టిందన్నారు. పీ ఆర్ సి, డిఏ బకాయిలు, సిపిఎస్ రద్దు పై ఉద్యమం చేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ లపై నాలుగు వేల కేసులను బనాయించిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆ కేసులన్నిటిని రివ్యూ చేసి ఎత్తివేస్తామని అసెంబ్లీలో ప్రకటించారని తెలియజేశారు.
ఉద్యోగులు తాము దాచుకున్న జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ ఖాతాలో నుంచి రుణాలు మంజూరు కాక పెట్టుకున్న బిల్లులు పరిష్కారం గాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, వీటిని నూతన ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తామని తెలిపారు.
ఉద్యోగుల ఆకాంక్ష మేరకు ఏర్పడిన నూతన ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణం ప్రదర్శిస్తుందన్నారు. గత ఐదు సంవత్సరాల పాటు జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు.
ప్రస్తుత నూతన ప్రభుత్వం ఒకటో తారీకునే జీతాలు, పెన్షన్లు చెల్లింపు చేయడం హర్షణీయమన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. సాధ్యమైనంత త్వరలో ఉద్యోగుల బకాయిలను చెల్లించేలా కృషి చేస్తామన్నారు. పీఆర్సీ కమిటీకి కమిషన్ ను నియమించి నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. నివేదిక సమర్పించేలోపు ఉద్యోగులకు మధ్యంతర భృతిని చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడంలో ఉద్యోగులు మరింత సహకరించి రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ లో ఉద్యోగుల సభ్యత్వ నమోదు ఉద్యోగ సమాచారం చందాదారులను చేర్పించడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యాసాగర్ కార్యవర్గ సభ్యులకు సూచించారు.
నగర శాఖ అధ్యక్షుడు సిహెచ్ వి ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ లో విజయవాడ నగర శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జిల్లా రాష్ట్ర సంఘ నాయకుల ఆదేశాలు సూచనలను ఎప్పటికప్పుడు అమలు చేయడంలోను ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంలోను నగర శాఖ తనదైన ముద్ర వేసుకుందన్నారు. ఉద్యోగుల సభ్యత్వ నమోదుపై ఇటీవల ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగిందని నగరంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులను ప్రత్యక్షంగా కలిసి సభ్యత్వ నమోదు చేయడం జరిగిందని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది దాదాపు ఐదు వందల మందికి పైగా సభ్యత్వం పొందడం జరిగిందని వివరించారు. నగర శాఖలో పదోన్నతి వలన ఖాళీ అయిన కార్యదర్శి పదవికి కో ఆప్షన్ నిర్వహించి ఐటిఐ కళాశాలకు చెందిన ఇ. సాగర్ కార్యదర్శి పదవికి ఎంపికైనట్లు సివిఆర్ ప్రసాద్ తెలిపారు.
సమావేశంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డి. సత్యనారాయణ రెడ్డి, జిల్లా నాయకులు పి. రమేష్, బి. సతీష్ కుమార్, ఐ టి ఐ ఉద్యోగులసంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. రమేష్ మాజీ అధ్యక్షులు ధర్మేంద్ర నగర కార్యవర్గ సభ్యులు షేక్. నాజీరుద్దీన్, డీఎస్ఎన్ శ్రీనివాసరావు, బి. రాజశేఖర్, వివి ప్రసాద్, బి. మధుసూదనరావు, డి. రాజచౌదరి, ఖాసీం సాహెబ్, ఎం. శ్రీనివాసరావు, కెఆర్ఎస్ గణేష్, పి. శ్రీనివాసరావు, జి. వరప్రసాద్, కె. శివ శంకర్, నాగరాజు, ఎం. రాంబాబు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.