ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్
ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో ఆర్థిక ఉగ్రవాదులను ఏరిపారేస్తాం
వేలకోట్ల ప్రజా సంపద దోచేసి ప్యాలెస్ల నుంచి ఎస్టేట్లకు ఎదిగారు
ఇటుకా…ఇటుకా పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాం
చరిత్రలో చూడని భూ వివాదాలతో ప్రజలు అల్లాడుతున్నారు… వచ్చే మహానాడు నాటికి భూ సమస్యలు తీర్చుతాం
అభివృద్ధి కొనసాగాలంటే మంచి ప్రభుత్వాలు కంటిన్యూ అవ్వాలి
వైకుంఠపాళి అభివృద్ధి మనకు వద్దు… నిరంతర అభివృద్ధి జరగాలి
కడప టీడీపీ అడ్డా అని మహానాడుతో నిరూపించాం
ఆదరించిన జనం రుణం తీర్చుకుంటాం..
రాయలసీమ అభివృద్ధికి బ్లూప్రింట్
అన్నమయ్య ప్రాజెక్ట్ తిరిగి నిర్మిస్తాం
జూన్ 12లోపు కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తాం
కడపకు నీళ్లు అందించేందుకు గాలేరు-నగరికి రూ.1,000 కోట్లు
గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
మహానాడు తీర్మానించిన ఆరు శాసనాలు తెలుగు జాతి అభివృద్ధికి మార్గాలు
శభాస్ కడప…మహానాడు సూపర్ హిట్
కార్యకర్తల త్యాగం, పోరాటాల ఫలితమే ఈ ప్రజాపాలన
మహానాడు బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు
జనసంద్రమైన కడప మహానాడు – పసుపు పండుగలా ముగింపు సభ
కడప, మే 29: పాక్ ఉగ్రవాదులను ఏరిపారేసిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్… పాజిటివ్, ప్రోగ్రసివ్ పాలిటిక్స్కు నాంది పలుకుదామని… టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కడప మహానాడు వేదికగా పిలుపునిచ్చారు. టెర్రరిస్టులు దేశానికి ఎంత ప్రమాదమో….రాజకీయ ముసుగులో ఉన్న ఆర్ధిక ఉగ్రవాదులు సమాజానికి అంతకంటే ప్రమాదకరమని.. వారిని రాష్ట్రం నుంచి తరమికొడదామన్నారు. భారతదేశం టెర్రిస్టులపై ఆపరేషన్ సింధూర్ చేసినట్లుగానే… ఆర్ధిక ఉగ్రవాదులను ‘ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్’తో రాజకీయల్లో లేకుండా చేద్దామన్నారు. రాజకీయాలు అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలో ల్యాండ్, సాండ్, వైన్, మైన్ వంటి స్కాంలతో రాష్ట్రాన్ని దోచేశారని అన్నారు. నాడు నమ్మి ఓటేస్తే జె బ్రాండ్స్తో, గంజాయి, డ్రగ్స్తో ప్రజల ఆరోగ్యాలు పాడుచేశారని చెప్పారు. అడవులు ఆక్రమించి ఎస్టేట్ లు నిర్మించుకున్నారని… కొండలు-చెరువులు కూడా మింగేశారని విమర్శించారు. ప్యాలెస్ల నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని… అహంకారంతో విర్రవీగిన వైసీపీకి బుద్ధిచెప్పారని చంద్రబాబు అన్నారు. పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో టీడీపీ ప్రస్థానం ఒక ఒక కేస్ స్టడీగా.. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నడపకూడదో వైసీపీ ఒక కేస్ స్టడీగా పేర్కొన్నారు. గురువారం కడప శివార్లలో మహానాడు 3వ రోజు నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. వైసీపీని అడ్రస్ లేకుండా చేస్తామన్న చంద్రబాబు… టీడీపీ కార్యకర్తల త్యాగం, పోరాటాల ఫలితంగానే ఈ ప్రజాపాలన వచ్చిందన్నారు.
మహానాడు సూపర్ హిట్
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు..దేవుని గడపలో జరిగింది. రెస్సాన్స్ అదిరింది. సూపర్ హిట్ అయ్యింది. ఇక్కడ మీకొక విషయం గుర్తు చేయాలి. గత ఏడాది మే 2వ తేదీన ప్రజాగళం ఎన్నికల సభ కోసం నేను కడపకు వచ్చాను. ఆ రోజు సభలో “కడప రాజకీయం మారుతోంది. కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది” అని అన్నాను. ఆ మాట అక్షరాలా నిజమైంది. ఆ ఎన్నికల్లో కడపలోనే కాదు…రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో అద్భుత విజయం సాధించాం. ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 సీట్లల్లో 7 సీట్లు కూటమి గెలుచుకుంది. ఈ సారి ఇంకొంచెం ఫోకస్ పెట్టి 2029 ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలిచేందుకు సిద్ధమా తమ్ముళ్లూ, ఆడబిడ్డలూ అని అడుగుతున్నాను. ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు… 52 స్థానాలకు 45 స్థానాల్లో కూటమిని గెలిపించారు. ఇందులో టీడీపీనే 40 సీట్లు గెలిచింది. వైసీపికి సీమ జిల్లాల్లో 7 స్థానాలొస్తే, కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలోనే 7 స్థానాలు వచ్చాయి. ప్రజాతీర్పు మనకు బాధ్యత గుర్తు చేసింది. వైసీపీ ఓటమిని ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోదు కూడా. టీడీపీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు….ప్రజల జీవితాలు మార్చాలనేదే మన సిద్దాంతం.
ప్రజా తిరుగుబాటుతో తిరుగులేని విజయం
తెలుగు దేశం పార్టీకి ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నికలు, గెలుపు కొత్త కాదు. గత ప్రభుత్వంపై 5 ఏళ్లు మనం పోరాటాలు చేశాం. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు, బూతులు అణిచివేతను కార్యకర్తలు ఎదుర్కొన్నారు. మీరే నా బలం, బలగం. ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని… టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాం. ప్రజలు అసాధారణ విజయంతో ఆశీర్వదించారు. 93 శాతం స్ట్రయిక్ రేట్, 57 శాతం ఓట్ షేర్ , అదిరిపోయే మెజారిటీలు ఇచ్చారు. ఒకప్పుడు అసెంబ్లీకి 10 వేలు…15 వేలు మెజారిటీలు వస్తే మంచి మెజారిటీలు అనుకునేవాళ్లం. కానీ మొన్నటి ఎన్నికల్లో 83 మందికి 30 వేలుపైన, 30 మందికి 50 వేలుపైన, 10 మందికి 70 వేలుపైన, ముగ్గురికి 90 వేలుపైన మెజారిటీలు వచ్చాయి. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, భీమిలిలో గంటా శ్రీనివాస రావు, మంగళగిరిలో నారా లోకేష్కి 90 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. (why not) వైనాట్లు, గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కాదు… ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం….ఏడాదిగా అదే చేస్తున్నాం.
గత ప్రభుత్వంలో ఐదేళ్లూ అంథకారమే
సరిగ్గా ఏడాది క్రితం…రాష్ట్రం చిమ్మచీకట్లో, అస్థవ్యస్థ పరిస్థితుల్లో ఉంది. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు పెట్టారు. రూ.1.20 లక్షల కోట్ల బకాయిలు పెట్టారు. అప్పులకు ఏడాదికి కట్టాల్సిన వడ్డీనే రూ. 40 వేల కోట్లు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు లేని పరిస్థితి నాడు ఉంది. అయితే కష్టాలను చూసి బెదిరిపోలేదు… సవాళ్లను చూసి పారిపోలేదు… అనుభవంతో ఆలోచించాను. క్లైమోర్ మైన్స్కే భయపడని నేను సమస్యలకు భయపడతానా? మనో ధైర్యంతో ముందుకు పోయాం. సంకల్పంతో ఒక్కో ఇటుకా పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మించే యజ్ఞం చేస్తున్నాం. ఏడాదిలోపే ఎన్నో సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలతో సుపరిపాలన అంటే ఏంటో చూపించాం.
అందరికీ సంక్షేమమే ధ్యేయం
అభివృద్ది-సంక్షేమం-సంపద సృష్టి నిరంతరం చేస్తూ… మెరుగైన జీవన ప్రమాణాలు అందించే విధానంతో అడుగులు వేస్తున్నాం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్. నన్ను నమ్ముకున్న జనం కోసం ఎంతైనా కష్టపడతాను. కోడూరు నుంచి 60 ఏళ్ల వయసులో సైకిల్పై ఓ కార్యకర్త కడప మహానాడుకు వచ్చాడంటే అదీ అభిమానం. ఇంతటి అభిమానం పూర్వజన్మ సుకృతం. నెలానెలా ఇస్తున్న పింఛన్లే మనం ఏ స్థాయిలో సంక్షేమం అందిస్తున్నామో చెబుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రమైనా 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తోందా…? ఏడాదికి రూ.33,000 కోట్లు కేవలం పింఛన్లు కోసం ఖర్చు చేసే రాష్ట్రం ఉందా…? మన ప్రభుత్వం దీనిని సాధ్యం చేసింది. మాటిచ్చిన విధంగా వివిధ వర్గాలకు రూ.4 వేలు, రూ.6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేల వరకు పింఛన్లు ఇస్తున్నాం. ముందు 3 నెలల మొత్తాన్ని కూడా కలిపి ఇచ్చాం. 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి… మొదటి సంతకం మాట నిలబెట్టుకున్నాం. దీపం పథకం కింద నాడు గ్యాస్ కనెన్షన్ లు ఇచ్చాం. నేడు దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి 4 నెలలకోసారి మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం. ఎస్సీ వర్గీకరణకు ఉమ్మడి రాష్ట్రంలో నాంది పలికింది మనమే. ఏబీసీడీ కేటగిరీలు చేసి ఇబ్బందులు, సవాళ్లు అధిగమించి నేడు ఎస్సీ వర్గీకరణ చేసింది మన ప్రభుత్వమే. సోషల్ రీఇంజినీరింగ్లో ఇదొక చారిత్రక ఘట్టం. అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లపై దృష్టిపెట్టాం. వీటి కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని 203 అన్న క్యాంటీన్లు తెరిచాం. అన్నక్యాంటీన్లను మూసేసి పేదల పొట్ట కొట్టిన వ్యక్తి మనకు అవసరమా.. అని అడుగుతున్నాను. 21 దేవాలయాల్లో నిత్యాన్నదానం ప్రారంభిస్తున్నాం. గత ప్రభుత్వం కేంద్ర ఇచ్చిన నిధులను దారిమళ్లించి… దుర్వినియోగం చేసింది. దీంతో కేంద్రం రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టింది. రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిన 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 73 పథకాలు పునరుద్ధరించాం. ఇదీ మన చిత్తశుద్ది.
టీడీపీ అంటేనే బీసీల పార్టీ
తెలుగు దేశం అంటేనే బీసీల పార్టీ. టీడీపీకి బీసీలే వెన్నుముక. బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి ఎప్పుడూ పెద్దపీట వేస్తాం. మొన్నటి బడ్జెట్ లో బీసీల కోసం రూ.47,456 కోట్లు కేటాయించాం. నాయి బ్రాహ్మణుల వేతనాలు రూ.25 వేలకు పెంచాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం. పవర్ లూమ్స్కు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్స్ 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయించాం. వడ్డెరలకు మైనింగ్ లీజులు ఇస్తాం. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. మత్య్సకారుల సేవలో పథకం ద్వారా రూ.20 వేల ఆర్థిక సాయం కింద రూ. 259 కోట్లు ఇప్పటికే అందజేశాం. జీవాల కోనుగోలుకు యాదవులు, కురబలకు ఆర్థిక సాయం చేస్తాం. స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. పిఎం సూర్యఘర్ కింద 20 లక్షల ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఉచితంగా సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేస్తున్నాం. సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలో వాట్లకు గాను మొత్తం రూ.98 వేలు సబ్సిడీ ఇస్తాం. అగ్రవర్ణాల వారు తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు పెట్టుకుంటే రూ. 78 వేలు సబ్సిడీ ఇస్తాం. రైతులు పొలాల్లో పీఎం కుసుమ్ కింద సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకోవాలి. వేద విద్యార్థులకు రూ.3 వేల భృతి, అర్చకుల జీతాలు రూ.15 వేలు, ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు, పాస్టర్లకు రూ.5 వేలు చొప్పున గౌరవ వేతనాలు పెంచాం. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాం. అమరావతిలో 5 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు విగ్రహం, స్మారకం నిర్మిస్తాం. జూనియర్ న్యాయవాదులకు భృతి చెల్లిస్తున్నాం. టెక్నాలజీ ద్వారా పాలనను సులభం చేస్తాం. సాంకేతికతతో అవినీతికి తావులేకుండా చేస్తాం. దేశంలోనే ప్రథమంగా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ‘మన మిత్ర’తో 380 సేవలు అందిస్తున్నాం. త్వరలో ఈ సేవల్ని 500కు పెంచుతాం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజాభిప్రాయంతో సేవలు మెరుగుపరుస్తున్నాం.
ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి
టీచర్లకు మేలు చేసేలా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు రూ.213 కోట్ల సరెండర్ లీవ్ల సొమ్ము ఇచ్చాం. గత ప్రభుత్వం ఉద్యోగులను అవమానాలకు గురిచేసింది. వారి పిఎఫ్ సొమ్మును కూడా మింగేసింది. నేడు మన కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు ఇవ్వడమేకాకుండా… ఏడాది కాలంలో రూ.7,500 కోట్లు వివిధ మొత్తాల కింద విడుదల చేశాం. అంగన్వాడీలు, ఆశాలకు రూ.1.5 లక్షల మేర లబ్ది చేకూరేలా గ్రాట్యుటీ అమలు చేశాం.
భూ బకాసురుల ఆటలు సాగవు
గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలకు, భూ మాఫియాలకు ప్రజలు అల్లాడిపోయారు. నా రాజకీయ జీవితంలో ఈ స్థాయి భూ సమస్యలు ఎప్పుడూ చూడలేదు. పేదలను దోచుకునేందుకు 22 Aను అస్త్రంగా చేసుకున్నారు. ఆస్తులను వివాదాల్లోకి నెట్టారు. అధికారంలోకి రాగానే ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశాం. కొత్తగా యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాం. మనం అధికారంలోకి రాకపోయుంటే మీ భూములన్నీ లాక్కునేవారు. రాబోయే మహానాడు కల్లా భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేస్తానని హామీ ఇస్తున్నాను.
4 ఏళ్లలో మెగా ప్రాజెక్టులు, మెగా లక్ష్యాలు
గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే ఢిల్లీలో మనకు పరపతి పెరిగింది. కేంద్ర సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టాం. 2027, డిసెంబర్ లోగా పోలవరం పూర్తిచేసే బాధ్యత నాది. విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ కాపాడాం… రైల్వే జోన్ ఏర్పాటయ్యేలా చూశాం. మూడు ముక్కలాటతో రాజధాని లేకుండా చేశారు. మన ప్రభుత్వం వచ్చేసింది. అమరావతికి రూ. 15 వేల కోట్లు సమకూర్చేందుకు కేంద్రం సహకరించింది. ఇంటింటికీ నీళ్లు అందించాలనేది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన. అయితే గత పాలకులు కేంద్రం తెచ్చిన జల్ జీవన్ మిషన్, అమృత్ వంటి పథకాలను కూడా నిర్వీర్యం చేశారు.
యువత కలలు నెరవేరుస్తున్నాం
మొన్నటి విజయంలో యువత భాగస్వామ్యం మరువలేం. వారి భవిష్యత్ కోసమే నేను పనిచేసేది. యువశక్తికి అవకాశాలు కల్పిస్తే… అద్భుతాలు చేస్తారని నేను బలంగా నమ్ముతాను. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే 20 లక్షల ఉద్యోగాల కల్పిస్తామని చెప్పాం. దాని కోసమే కష్టపడుతున్నాను. రూ. 7 లక్షల 50 వేల కోట్ల 6 లక్షలమందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయి. మీ రాష్ట్రంలో భూతం ఉంది. రావాలంటే భయమేస్తోందని కొందరు పారిశ్రామికవేత్తలు అన్నారు. ఆ భూతాన్ని భూ స్థాపితం చేస్తున్నామని భరోసా ఇచ్చాను. నూతనంగా తీసుకువచ్చిన 20కు పైగా పాలసీలతో ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికి రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాం. ఏడాదిలో దేశీయ పెట్టుబడుల్లో అగ్రస్థానంలో ఉన్నాం. వృద్ది రేటులో దేశంలో రెండో స్థానానికి వచ్చాం. అమరావతికి క్వాంటమ్ వ్యాలీ, విశాఖకు గూగుల్, టీసీఎస్… అలాగే రాష్ట్రంలో రిలయన్స్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఎల్జీ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్ది యువతకు ఉపాధి కల్పించడంతో పాటు వర్క్ ఫ్రమ్ అవకాశాలు ఇస్తాం. మళ్లీ చెపుతున్నా I AM WITH YOU…….. I AM WITH YOUTH. యువతే నా బలం. యువతపైనే నా ఆశలు. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం.
అభివృద్ధి వికేంద్రీకరణ…. రాయలసీమ డిక్లరేషన్
రాయలసీమ అంటే రాళ్ల సీమ కాదు….రాయలసీమను రాష్ట్రానికి ఒక మణిహారంగా మారుస్తాం. రాయల సీమ అభివృద్దికి ప్రధాన అడ్డంకి ఫ్యాక్షనే అని నాడే గుర్తించాం. సీమ గడ్డపై ఫ్యాక్షన్ ఉండకూడదని కఠినంగా వ్యవహరించాను. రాయల సీమ అభివృద్దికి మన దగ్గర ప్రత్యేక బ్లూప్రింట్ ఉంది. ఎడ్యుకేషన్ సంస్థలు, ఇరిగేషన్, హార్టికల్చర్, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడ్ లతో సీమలో ఏ జిల్లాకు ఏం చెయ్యాలో పక్కా ప్రణాళిక ఉంది. ఇప్పటికే తిరుపతిలో IIT, IISER, ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ, IIT -DM, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ వంటి సంస్థలు మనం తెచ్చాం. కడపలో హజ్ హౌస్ మొదలుపెట్టి 90 శాతం నిర్మిస్తే… గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేదు. 6 నెలల్లో హజ్ హౌస్ పూర్తి చేస్తాం. లేపాక్షి – ఓర్వకల్ కారిడార్లో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్కు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. ఆరోజు ఓబులాపురం మైన్స్ పేరుతో దొంగ వ్యాపారం చేసి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించారు. ఆ స్కామ్ లో భాగస్వాములు జైల్లో ఉన్నారు. కడప స్టీల్ ప్లాంట్కు నేను శంకుస్థాపన చేస్తే మళ్లీ భూమి పూజ చేసి నాటకాలాడారు. జూన్ 12 లోగా కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తాం. ఫేజ్ 1లో రూ.4,500 కోట్లతో, ఫేజ్ 2లో మరో రూ.4,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాం. ఇది పూర్తి చేసి 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ల అభివృద్ధి పనులు రూ. 5 వేల కోట్లతో జరుగుతున్నాయి.
సీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
నీటి విలువ, రైతు కష్టం విలువ తెలిసిన పార్టీ తెలుగు దేశం. రాయలసీమకు సాగునీళ్లు ఇవ్వాలని మొదట ఆలోచన చేసిందే ఎన్టీఆర్. సీమకు నీళ్లిస్తాం. తెలుగుగంగ, కెసి కెనాల్ అభివృద్ది, హంద్రీనీవా, గాలేరు – నగరి, మచ్చుమర్రి లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవే. వేదవతి, అలగనూరు, గండికోట లిఫ్ట్ ప్రాజెక్టులు మన చొరవే. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ను పునర్ నిర్మిస్తాం. నాటి మన ప్రభుత్వంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై రూ.12,441 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ఖర్చు చేసింది కేవలం రూ. 2 వేల కోట్లు మాత్రమే. సీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని పోలవరం-బనకచర్ల కు రూపకల్పన చేశాం. వంశధార నుంచి పెన్నా వరకూ నదుల అనుసంధానం జరుగుతుంది. నేను సంకల్పం చేస్తే వదలను. హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 కోసం రూ.3,873 కోట్లతో పనులు చేస్తున్నాం. గాలేరు నగరి పనులు పూర్తి చేసి జలాలు కడపకు తీసుకురావడానికి అవసరమైన రూ. 1,000 కోట్లు ఇప్పుడే విడుదల చేస్తున్నాను. రాయలసీమను ఉద్యానవన పంటలకు చిరునామాగా చేస్తాం. గండికోట ఎపి గ్రాండ్ క్యానియన్. దీన్ని ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. అక్కడే శ్రీకృష్ణ దేవరాయుల 100 అడుగుల విగ్రహం పెట్టి… ప్రజల అభిమతం నెరవేరుస్తాం. తిరుపతి, ఒంటిమిట్ట, కాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, అహోబిలం, మంత్రాలయం, పుట్టపర్తి క్షేత్రాలను టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తాం. సీమలో రాబోయే రోజుల్లో పేదరికం ఉండదు. రాష్ట్రానికి మణిహారంగా తయారుచేస్తాం. ప్రజల జీవితాలు మార్చేది మంచి పాలన, మంచి పాలసీలు మాత్రమే. కులం, మతం, ప్రాంతం కాదు. అందుకే ప్రజలు ఏ పార్టీ మంచిచేస్తుంది.. ఏ పాలకుడు అభివృద్ది చేస్తాడు అనేది చూడాలి. 2019లో తెలుగు దేశం రాకపోవడం వల్ల ఎంత నష్టపోయారో ప్రజలు మరిచిపోకూడదు. 2004 వరకూ తెలంగాణలో టీడీపీ చేసిన అభివృద్ధి ఆ రాష్ట్రాన్ని ఎకానమీలోనే దేశంలోనే నెంబర్ వన్ చేసింది. నాడు గెలిచి ఉంటే… ఇప్పుడు మనం చెప్పుకున్న పనుల్లో అనేకం గతంలోనే పూర్తయ్యేవి. తెలుగుదేశం అధికారానికి దూరమైన ప్రతి సారీ…. రాష్ట్రం అంథకారంలోకి వెళిపోతుంది. అందుకే చెపుతున్నా… మంచి పాలకులు కొనసాగాలి. అభివృద్ది అనేది వైకుంఠపాళి కాకూడదు. అప్పుడే అనుకున్న ఫలాలు ప్రజలకు అందుతాయి.
6 శాసనాలతో అద్భుత ఫలితాలు
‘ఈ మహానాడులో తీర్మానించుకున్న 6 శాసనాలతో నూతనత్వాన్ని, కొత్త నాయకత్వాన్ని తెచ్చాం. ఈ శాసనాలను తూచా తప్పకుండా అమలుచేసి తిరుగులేని ఫలితాలు సాధిద్దాం. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రతీ ఏడాది ఏం చేశామో చెపుతాం. 2029 నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యం. ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించి , కనీస అవసరాలు తీర్చుతాం. కార్యకర్తే అధినేత అని మరోసారి చెబుతున్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 2 లక్షల 67 వేలు. వచ్చే 22 ఏళ్లలో దానిని రూ.55 లక్షల చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వెల్తీ, హెల్తీ, హ్యాపీ మన నినాదం. నా జీవితంలో ఇలాంటి మహానాడును చూడలేదు. వచ్చే నెల జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శ్రీకారం చుడతున్నాం. విశాఖ ఆర్కే బీచ్ పక్కన ఐదు లక్షలమంది యోగా చేస్తారు. ఇదో ప్రపంచ రికార్డు. రాష్ట్రమంతటా 2 కోట్లమంది యోగా చేస్తారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, పేదరికం లేని సమాజం తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యక్రమం చివరిలో కోడూరు నుంచి సైకిల్పై వచ్చి మహానాడుకు హాజరైన కార్యకర్తను సీఎం సన్మానించారు. ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి విజ్ఞప్తి మేరకు కడపకు తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు, బుగ్గవంక చెరువు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి సభా వేదికగా హామీ ఇచ్చారు.
