విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం
శాసనసభ్యులు సుజనా చౌదరి
నేటితరం విద్యార్థుల ఆలోచన విధానానికి అనుగుణంగా సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతూ విద్యను అందించడం ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేయవచ్చని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. కేబీఎన్ కళాశాల 60వ వార్షికోత్సవ వేడుకలను కళాశాల ఆవరణలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేబీఎన్ కళాశాల ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును మార్చిందన్నారు. వేలాది మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన కేబీఎన్ కళాశాల 60వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందన్నారు. కళాశాల అభివృద్ధికి, అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసి , అధ్యాపకుల, సిబ్బంది, సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యా సంస్థలు రాజకీయాలకతీతంగా ఉంటూ సేవలను అందించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అధ్యాపకులు కూడా మారుతూ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. పేద విద్యార్థులకు సహకారం అందిస్తూ, కుల,మత వర్గ బేధాలు లేకుండా అధ్యాపకులందరూ సమిష్టిగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. పశ్చిమ లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంప్లాయిమెంట్,
ఎంట్రప్రెన్యూర్ షిప్, ఎడ్యుకేషన్ అనే నూతన కార్యక్రమాన్ని విజయదీపం, పేరిట ప్రారంభించామన్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణ, హార్డ్ వర్క్ తోపాటు స్మార్ట్ వర్క్ చేయడం అలవర్చుకోవాలన్నారు. 60 ఏళ్లుగా దేదీప్యమానంగా వెలుగుతూ కళాశాల అభివృద్ధిని తమ భుజస్కందాలపై మోస్తున్న ఎస్ కే పి వి హిందూ హై స్కూల్ కమిటీ జనరల్ సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ గోపిశెట్టి మల్లయ్య, తూనిగుంట్ల శ్రీనివాస్, మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రిన్సిపల్ వి నారాయణరావులను అభినందించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి నారాయణ రావు మాట్లాడుతూ 12,000 వేల మంది విద్యార్థినీ విద్యార్థులతో 300 మంది సిబ్బందితో కేబీఎన్ కళాశాల దేదీప్యమానంగా వెలుగుతోందన్నారు. ఆరు దశాబ్దాలుగా కేబీఎన్ కళాశాల అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో వేల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న కమిటీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్ కే పి వి హిందూ హై స్కూల్ అధ్యక్షులు టి శేషయ్య,కరస్పాండెంట్ గోపి శెట్టి మల్లయ్య, సెక్రటరీ తూని గుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ యు ఉమామహేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వరరావు , అన్నం రామకృష్ణారావు, ఏపీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు హాజరై వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.