06-11-2024
ఆటోనగర్ లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు కి కృషి : ఎంపి కేశినేని శివనాథ్
ఎంపి ని కలిసిన ఆటో మొబైల్ మెకానిక్స్
విజయవాడ : ఆటోమొబైల్ రంగంలో మారిన సాంకేతికతను అందిపుచ్చుకుని నైపుణ్యం పెంచుకునే విధంగా ఆటోనగర్ లో మూడు నాలుగు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
ఆటో మొబైల్ టెక్నిషియన్ అసోసియేషన్ (ఎ.టి.ఎ) మాజీ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ నాయకులు, కార్యకర్తలు, మెకానిక్స్ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఎంపి కేశినేని శివనాథ్ ను కలిశారు.
మెకానిక్స్ తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆటో మొబైల్ రంగంలో మ్యాన్ పవర్ పెంచే విధంగా, వాహనాల తయారీలో వచ్చిన నూతన టెక్నాలజీకి తగ్గట్లు అప్ గ్రేడ్ అయ్యే విధంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి ట్రైయినింగ్ ఇప్పిస్తామని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. రాబోయే కాలంలో విజయవాడ ఆటోనగర్ కి పునర్వైభవం రానుందని చెప్పారు. మెకానిక్స్ అందరూ అందుకు తగ్గట్లుగా అప్ గ్రేడ్ కావాలని పిలుపునిచ్చారు. అశోక్ లైలాండ్, టాటామోటార్స్, భారత్ బెంజ్, మహీంద్ర వంటి కంపెనీలతో మాట్లాడి సిల్క్ డెవలప్ మెంట్ సెంటర్స్ లో ఆ కంపెనీ ప్రతినిధులతోనే శిక్షణ ఇప్పించే విధంగా కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గంధం వెంకటేశ్వరరావు(కొండా), సెక్రటరీ షేక్ దస్తగిరి, కోశాధికారి మైలు రామ్మోహన్ రావు (రాము), ఎలక్ట్రికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కొడూరు ఆంజనేయులు, సెక్రటరీ జాస్తి సురేష్ పాల్గొన్నారు