Home Political news రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ “సీ ప్లేన్”

రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ “సీ ప్లేన్”

4
0

 రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ “సీ ప్లేన్”

రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీ ప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

మార్చి నుంచి పర్యాటకులకు సీప్లేన్ అందుబాటులోకి తెస్తాం

పర్యాటక రంగానికి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం

శ్రీశైలం మాస్టర్ ప్లాన్ కొరకు మంత్రుల మాస్టర్ తో కమిటీ

శ్రీశైలం ప్రెస్ మీట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

శ్రీశైలం, నవంబర్ 09

రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో “సీ ప్లేన్” ప్రవేశపెట్టడం అద్భుతమైన ఆవిష్కరణ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

శనివారం శ్రీశైలం పాతాళగంగ రోప్ వే ఎంట్రీ పాయింట్ వద్ద ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… శ్రీశైలం ఇదోక దివ్య క్షేత్రం. పరమశివుని 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి. ఈరోజు ఒక ముఖ్యమైన సీప్లేన్ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇదొక వినూత్నమైన కార్యక్రమం. ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్లో ప్రయాణం చేయడం అద్భుతంగా ఉంది. శ్రీశైలం దక్షిణ భారతదేశంలో ఈ ప్రముఖ దేవాలయాన్ని దక్షిణకాశీగా పిలుస్తారు. మల్లికార్జునస్వామి భ్రమరాంబదేవి స్వయంభువులుగా కొలువై ఉన్నారని ప్రతి ఒక్కరి నమ్మకం విశ్వాసం. ఇక్కడ దర్శనం చేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి వస్తుంది. పరమ పవిత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో సీ ప్లేన్ ప్రారంభమై… మరొక దివ్య క్షేత్రం శ్రీశైలంలో దిగడం అదృష్టంగా భావిస్తున్నాం. ఒక మంచి ప్రదేశం ఒక అద్భుతమైన దృశ్యాలు చూస్తూ 40 నిమిషాల్లో విజయవాడ నుండి శ్రీశైలం చేరుకున్నాం. హెలికాప్టర్లు విమానాల్లో తిరిగిన దానికన్నా నాకు ఇది ఒక కొత్త అనుభూతి

శ్రీశైలం పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు.. సాధారణ రోజుల్లో ఒక 25 వేల మంది వస్తున్నారు. వీకెండ్స్ లో అయితే 70 వేల వరకు, ముఖ్యమైన రోజులలో 1.50 లక్షల మంది సందర్శకులు వస్తున్నారు. ఇక్కడ పర్యటకానికి చక్కటి వనరులున్నాయి. ట్రాఫిక్ జాము, రోడ్లు సరిగా లేని పరిస్థితి, రెండు మూడు రోజులు ఉండడానికి వసతి ఇబ్బందులు ఉన్న పరిస్థితి. వీటిని అధిగమించి ఒక దివ్య క్షేత్రంలో ఒక అనుకూలమైన ప్రదేశం ఇది. పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయాలి. తుమ్మల బైలు టైగర్ సఫారీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం అడవి ప్రాంతం వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంది. ఇక్కడ పులులు, చిరుతపులులు ఇతర అడవి జంతువులు చాలా ఉన్నాయి. పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తాయి. శ్రీశైలం డ్యాం నిండినప్పుడు నీరు వదిలితే పర్యాటక విహార యాత్రలో ఇదొక ఆహ్లాదకరమైన సన్నివేశం.* 

*దట్టమైన అడవుల మధ్యలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ అక్కమహాదేవి గుహలు, చెంచుమహాలక్షి గుడి, మ్యూజియం, సాక్షి గణపతి గుడి, శివాజీ గుడి లాంటి ఎన్నో క్షేత్రాలు కలిపి శ్రీశైలంలో పర్యాటకం, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయి. ఇలాంటి వాతావరణం మరెక్కడా దొరకదు. తిరుమల, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలు ప్రశాంత వాతావరణంలో ప్రకృతి ఒడిలో జీవిత కాలాన్ని మరింత పెంపొందిస్తాయి.*

*2014-15 లో రూ. 47 కోట్లతో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా తయారు చేయాలని ముందుకు వెళ్లాం.  రధాలు తిరగడానికి రోడ్లు వెడల్పు చేసాం, రింగ్ రోడ్డు ఏర్పాటు చేశాం. రోప్ వే తీసుకొచ్చాం. కానీ గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి సాగలేదు.*

*దోర్నాలలో నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజల్ట్స్ ఉంది. అక్కడ జంగిల్ హోం కాటేజ్ లు అడ్వెంచర్ కార్యక్రమాలు ఎడ్యుకేషన్ నేచర్ పార్క్,  కిడ్స్ పార్క్, మినీ జిమ్, ఆర్చరీ లాంటి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రకృతి పరంగా అనేక కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైన ప్రదేశం ఇది. తుమ్మలబైలు నల్లమల జంగిల్ సఫారీ.*

*తుమ్మలబయలు, రోళ్లమడుగు లోని జంగిల్, టైగర్ సఫారీ లాంటి నిర్మాణాలు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మరింత పర్యాటక, అధ్యాత్మిక శోభను అందిస్తామన్నారు.*

*నల్లమల అభయరణ్యంలో ప్రకృతి ఒడిలో, వన్యప్రాణులను సంరక్షించుకుంటూ.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం.*

*శ్రీశైలంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తాం. మంత్రులు పవన్, ఆనం, దుర్గేశ్, జనార్ధన్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేస్తాం. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అటవీ, దేవాదాయ శాఖ సలహాలు తీసుకుని వీలైనంత త్వరగా నివేదిక తెప్పించుకొని ముందుకెళ్తాం. శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సున్నిపెంట ప్రాంతాన్ని కూడా మంచి నివాస యోగ్యమైన ప్రాంతంగా, ఎడ్యుకేషన్ హబ్ గా.. అభివృద్ధి చేస్తాం. శ్రీశైలం తోపాటు.. 13వ శతాబ్దం నాటి గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియాగా ప్రపంచ ప్రసిద్ధి ప్రాంతం అయిన గండికోటను.. మరింత అభివృద్ధి చేస్తాం. ద్రావిడ ఇండో ఇస్లామిక్ పర్షియన్ వాస్తు కలలకు మారుపేరు అయిన గండికోటలో.. సాహస కార్యక్రమాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర పర్యాటక శాఖ సహకారంతో.. గండికోట పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. గండికోట ప్రపంచంలోనే టాప్ 10 లో ఉంది. గండికోటను అభివృద్ధి చేస్తే సుందర పర్యాటక ప్రాంతంగా మారుతుంది. గండికోటలో కూడా సీప్లేన్ కార్యకలాపాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.* 

*అమరావతి- శ్రీశైలం వరకు ఇవాళ సీప్లేన్ ట్రయల్ రన్ జరిగింది.. మార్చి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తాం. కేంద్ర సహకారంతో సీప్లేన్ కార్యకలాపాలు విస్తృతం చేస్తాం. పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. గండికోట, శ్రీశైలం, లంబసింగి, ఋషికొండ, కాకినాడ, తిరుపతి.. ఇవన్నింటినీ కూడా  కలుపుతూ టూరిజంను అభివృద్ధి చేయగలిగితే..  రాష్ట్రాన్ని టూరిజం పరంగా.. ప్రపంచానికే ఒక డెస్టినేషన్ గా తయారు చేయవచ్చు. రాబోయే రోజుల్లో పర్యాటకం కోసం మనం వేరే ప్రాంతాలకు పోవడం కాకుండా.. వేరే ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. రాష్ట్రాన్ని ఒక టూరిజం డెస్టినేషన్ గా తయారు చేస్తాం* 

*నా జీవితంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా.. బాధ్యతలు చేపట్టడం జరిగింది. మొన్నటి వరకు రాష్ట్రలో జరిగిన పాలన కారణంగా రాష్ట్రంలో అన్ని శాఖలు, వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. మొత్తంగా విధ్వంసం జరిగింది. బ్రాండ్ ఏపీ ఇమేజ్ దెబ్బతింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గెలవాలని ఆశించాం. ప్రజలు గెలిచారు. మన ప్రభుత్వం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభం అయింది. అభివృద్ధి సంక్షేమం ఎన్డీఏ ప్రభుత్వానికి రెండు కళ్ళు. ఒకవైపు గతంలో జరిగిన నష్టాన్ని.. పూడుస్తూనే అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం. అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది. సంపద సృష్టితో సంక్షేమం అమలు అవుతుంది. ప్రజలు ఇచ్చిన ఆక్సిజన్ తో.. వెంటిలేటర్ లపై నుండి కొలుకున్నాం

ప్రస్తుతం రాష్ట్రములోని అన్ని రిజర్వాయర్లు 93 శాతం నీటిని నింపుకొని పుష్కలంగా ఉన్నాయి. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో అన్ని రకాల వనరులను అభివృద్ధి చేయవచ్చు. పెన్నా గోదావరి వంశధార కలపాలని కృషి చేస్తున్నాం. పోలవరంలో 990 కోట్లతో మరల పార్లర్గా డయాఫ్రమ్ వాల్ కడుతున్నాం. రాయలసీమకు గోదావరి నీరు వస్తే పెద్ద మార్పు అవుతుంది. త్వరలోనే శుభవార్త చెబుతా. రాయలసీమకు ఉన్న వనరులు ఎక్కడా లేవు. సోలార్, విండ్, జల విద్యుత్ అభివృద్ధికి అవకాశం. కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక వాడలతోపాటు డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా ప్రపంచానికే డ్రోన్ వినియోగము,  పైలట్స్ ఇక్కడే తయారవుతారు. రాయలసీమలో ఇండస్ట్రీ పరంగా అన్ని రకాల వనరులున్నాయి. అందుకు తగ్గట్టు నీటి అవసరాలు కూడా ఉన్నాయి. నీటి అవసరాలను తీర్చేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నాం. ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికా ప్రకారం రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. 1995 సీఎం అంటే.. ఎలా ఉంటాడో ఇపుడు చూపిస్తాం

రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలను వదలిపెట్టం. ఖబడ్ధార్..!

కొన్ని దుష్టశక్తులు.. వారి రాజకీయ స్వలాభం కోసం సోషల్ మీడియాను ఇష్టానుసారం వాడుతున్నారు. అలాంటి వారిని వదిలి పెట్టం. ఐదేళ్లుగా అభివృద్ధి ఆగిపోయింది. ఏపీ బ్రాండ్ ను దెబ్బతీశారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం. వైసీపీ నేతల కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టినా వదలం. ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకునేది లేదు. రౌడీయిజం చేస్తే సహించేది లేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. జగన్ కు తల్లి, చెల్లి అంటే గౌరవం లేదు. మాకు సభ్యత, సంస్కారం ఉన్నాయి. మృగాలను ఎలా నిలువరించాలో మాకు తెలుసు. నా దగ్గర రౌడీలు, గూండాలు ఆటలు సాగవు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే చర్యలు. రౌడీలు, ఆంబోతులను కట్టడి చేస్తాం. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ను ప్రభుత్వం పక్కాగా నిర్వహిస్తోంది. తప్పును తప్పుగా చూస్తాం, తప్పు చేసిన వాణ్ణి ఊరికే వదలమని ముఖ్యమంత్రి హెచ్చరించారు

ఈ పాత్రికేయుల సమావేశంలో… కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి,  కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గౌరుచరితారెడ్డి, జయ నాగేశ్వర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here