Home Andhra Pradesh రేష‌న్ మాఫియాపై 1010 కేసులు న‌మోదు బియ్యం అక్రమ రవాణాపై

రేష‌న్ మాఫియాపై 1010 కేసులు న‌మోదు బియ్యం అక్రమ రవాణాపై

3
0

 రేష‌న్ మాఫియాపై 1010 కేసులు న‌మోదు

బియ్యం అక్రమ రవాణాపై

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కుపాదం

– 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చేసుకున్నాం

– అక్ర‌మార్కుల అరెస్టులు త‌ప్ప‌వు

– రేష‌న్ బియ్యం అక్ర‌మ మ‌ళ్ళింపులో కొంద‌రు ఎండీయూల ప్ర‌మేయం

అక్ర‌మ ర‌వాణా జ‌ర‌గ‌కుండా ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం అవ‌స‌రం

శాసన మండలిలో రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాల, వినియోగ దారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే.. కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణం అని రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈరోజు శాస‌న‌ మండ‌లిలో ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, దువ్వారపు రామారావు, పంచుమర్తి అనురాధ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రేష‌న్ మాఫియాపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1010 కేసులు నమోదు చేయ‌డంతో పాటు 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. విచార‌ణ అనంత‌రం అక్ర‌మార్కుల అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. పిడిఎస్ రైస్ అక్రమ రవాణాలో ఎండియూ ఆపరేటర్ ప్రమేయం ఉంద‌న్నారు. కాకినాడలో 13 రైస్ మిల్లులపై గతంలో తనిఖీలు నిర్వ‌హించి క్రిమినల్ కేసులు నమోదు చేసిన‌ట్లు పేర్కొన్నారు. పేదల‌కు అందాల్సిన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు చెక్‌పోస్ట్‌ల‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింద‌న్నారు. సంస్కరణలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు కలిసి ఎన్ఓసి సర్టిఫికెట్ ఉంటేనే పోర్ట్ అధికారులు బియ్యం ఎగుమతికి అనుమతించడం జరుగుతుంద‌న్నారు. రాష్ట్రంలో ఒక కోటి 48 లక్షల మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మంచి పౌష్టికాహారం అందించాలన్న‌దే ఉద్దేశం అన్నారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నాయ‌ని తెలిపారు. కూటమి ప్రభుత్వం 43 రూపాయల 40 పైసల‌కు కొనుగోలు చేసి పేద ప్రజలకు అందిస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమ రవాణా చేయకుండా ప్రజలు కూడా అడ్డుకోవాలని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులపై తనిఖీలు జరుగుతున్నాయ‌ని, ఇప్పటికే కృష్ణా, గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలో స్వయంగా తానే తనిఖీలు నిర్వహించిన‌ట్లు గుర్తు చేశారు. అదే విధంగా ప్రతి జిల్లాలో అక్రమ రవాణాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాకినాడలో ఈసి చట్టం 1955 సెక్షన్ 6ఎ కింద మొత్తం 13 కేసులు నమోదు చేసిన‌ట్లు చెప్పారు. కొందరు హైకోర్టును ఆశ్రయించడం ద్వారా హైకోర్టు సూచన మేరకు నాన్ పిడిఎస్ రైస్ 26488 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 83 కోట్ల 77 లక్షల బ్యాంక్ గ్యారంటీ విడుదల చేయడం జరిగింద‌న్నారు. పిడిఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండియు ఆపరేటర్ల ప్రమేయం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అందులో భాగంగా కాకినాడ జాయింట్ కలెక్టర్ ఎనిమిది మంది ఎండియు ఆపరేటర్లకు జరిమానా విధించ‌డంతో పాటు ఒక ఎండీయు ఆపరేటర్‌ను తొలగించడం జరిగింద‌ని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ శాస‌న‌ మండ‌లిలో వివ‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here